Harish Rao On Congress: మాజీ సీఎం కేసీఆర్ స్టేట్స్ మెన్ మాట్లాడితే.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీ మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. కృష్ణా నీళ్లను కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టిందన్నారు. కృష్ణా నీళ్లలో అతి తక్కువ నీటి వినియోగం రేవంత్ రెడ్డి పాలనలోనే అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చెక్ డ్యాంల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప ఏం ఒరిగిందేం లేదన్నారు. ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చి వేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారని హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందిందన్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించిందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందన్న రేవంత్ ఆరోపణలను హరీశ్ రావు ఖండించారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
పీసీసీ పదవిని రూ.50 కోట్లు పెట్టి కొనుకున్నారని, సొంత పార్టీ నేతలే విమర్శించారన్నారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి ఎదిగారన్నారు. బీఆర్ఎస్ త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వమని చెప్పారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యాగం చేసి చరిత్ర బీఆర్ఎస్ నేతలదని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్రెడ్డికి నీరుపారుదలపై కనీసం అవగాహన లేదని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ల ఉందో కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు.
కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని హరీశ్ రావు విమర్శించారు. అప్పుడే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కృష్ణా నీళ్లను తాకట్టు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీయే అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో కృష్ణా నీళ్ల అతి తక్కువ వినియోగం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు.
Also Read: Panchayat Elections: కమ్యూనిస్టు కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ జెండా విజయం.. ఆ గ్రామం ఇదే..
సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీకి దాసోహం అంటూ పాలమూరుకు అన్యాయం చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. గోదావరిలో తెలంగాణకు 500 టీఎంసీల నీళ్లు చాలు, మిగిలిన మీరే తీసుకోండని రేవంత్ రెడ్డి … తన గురువు చంద్రబాబుకు చెప్పారన్నారు. చంద్రబాబు రేవంత్ కు గురువు కావచ్చు, తెలంగాణకు కాదని అన్నారు. రేవంత్రెడ్డి రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతున్నారన్నారు. ఓ సారి చంద్రబాబు తన గురువు అంటారు, మరోసారి చంద్రబాబు నాకు గురువు అన్నోని గుండు మీదికెళ్లి తంతా అంటారని ఎద్దేవా చేశారు. ఇన్ని విధాలుగా మాట్లాడగలిగే రేవంత్ నోటికి మొక్కాలన్నారు.