HCU issue : #SaveHCU. ఈ హ్యాష్ట్యాగ్ తెగ వైరల్ చేస్తున్నారు. అడ్డమైన వీడియోలను హెచ్సీయూకు లింక్ చేసి ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఎక్కడ జింక కనిపించినా.. మరెక్కడ నెమలి వీడియో దొరికినా.. అవి సెంట్రల్ యూనివర్సిటీవే అంటూ కాకమ్మకథలు అల్లేస్తున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ వీడియోలు, ఏఐ జనరేటెడ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇలా ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారనే ఆరోపణతో బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్కు చెందిన దిలీప్, క్రిషాంక్లపై కేసులు కూడా పెట్టారు పోలీసులు. అయినా, ఈ రచ్చ ఆగట్లేదు. గులాబీ, కాషాయ సైన్యాలు పనిగట్టుకుని మరీ కంచ గచ్చిబౌలి భూములపై అబద్దపు ప్రచారం చేస్తున్నాయి. అక్కడ చెట్లు కొట్టేయడం వల్ల మూగజీవులు గూడు కోల్పోయి జనారణ్యంలోకి వస్తున్నాయంటూ లేటెస్ట్గా ఓ దుప్పి వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందో ఓసారి మీరే చూడండి…
జనాలనే గోస పెడుతుండు అనుకున్నాం కానీ వన్యప్రాణులను కూడా వదలట్లేదు పోతవురరై….
HCU పరిదిలో జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు…
దగ్గరలో ఉన్న గోపన పల్లి.. లో అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చింది… pic.twitter.com/WUv5oTZ8L7
— Puli sridhar (@sridharPuli9) April 3, 2025
ఆ వీడియోలో ఓ దుప్పి అపార్ట్మెంట్ ముందు దీనంగా నిలుచొని ఉంటుంది. ఒకతను బకెట్లో ఫుడ్, వాటరఱ్ తెచ్చిపెడతాడు. జస్ట్ 30 సెకన్ల వీడియో క్లిప్ అది. ఆ వీడియోకు మసాలాలు దట్టించి ఎవరిష్టం ఉన్నట్టు వాళ్లు వదులుతున్నారు. HCU ల్యాండ్స్ లో అడవులను కొట్టేస్తే.. సమీపంలోని గోపన్పల్లిలోని ఓ అపార్ట్మెంట్ దగ్గరకు ఈ మూగజీవి వచ్చిదంటూ.. రేవంత్ రెడ్డి సర్కారు టార్గెట్గా రకరకాల హెడ్డింగ్స్తో వైరల్ చేస్తున్నారు. ఆ టైటిల్స్ చూసి.. నిజంగానే గచ్చిబౌలిలో చెట్లు కొట్టేస్తే ఆ దుప్పి నీడ లేక ఇలా జనావాసాల్లోకి వచ్చిందనే అనుకుంటారు. కానీ, నిజం వేరు. ఆ వీడియో వేరు. వైరల్ చేస్తున్నది వేరు.
అసలు ఆ దుప్పి ఘటన హైదరాబాద్లో జరిగిందే కాదు. ఎక్కడో వైజాగ్లో జరిగింది. అక్కడి వీడియోను ఇక్కడ జరిగినట్టు ఫేక్ న్యూస్తో కాంగ్రెస్ సర్కారును బద్నామ్ చేసే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదంతా బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పక్కా ప్లాన్డ్గా చేస్తున్న తంతు అని తెలుస్తోంది. ఆ వీడియోలో కనిపించిన SS ARCADE అనే అపార్ట్మెంట్ అసలు గోపన్పల్లిలోనే లేదు. ఇది చాలదా అది ఫేక్ న్యూస్ అని చెప్పడానికి.
వైజాగ్ దుప్పి.. గచ్చిబౌలిదంటూ ఫేక్ ప్రచారం
కొన్ని వారాల క్రితమే ఈ దుప్పి వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. పలు క్రెడిబుల్ మీడియా సంస్థలు సైతం ఈ న్యూస్ను ఆనాడే ప్రసారం చేశాయి. ఎండ తీవ్రత, నీటి కొరతతో సమీపంలోని కొండపై నుంచి.. విశాఖలోని విశాలాక్షి నగర్లోని ఓ అపార్ట్మెంట్ దగ్గరికి దుప్పి వచ్చిందనేది ఆ న్యూస్ సారాంశం. దుప్పిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారంటూ.. సెల్ఫీలు దిగారంటూ.. పలు వార్తలు ప్రచురితమయ్యాయి. స్థానికులు కొందరు తమ సెల్ఫీలను సోషల్ మీడియా పేజెస్లోనూ పోస్ట్ చేశారు. వైజాగ్ జూపార్క్ నుంచి తప్పిపోయి వచ్చిన దుప్పి, జింకల వీడియోలు, ఫోటోలు కూడా గతంలో పోస్ట్ చేశారు.
ఆ వైజాగ్ దుప్పి వీడియోను ఇప్పుడు HCU ఇష్యూకు లింక్ పెడుతూ.. చెట్లు కొట్టేస్తే జింక జనావాసాల్లోకి వచ్చిందంటూ ఇదంతా పాలకుల పాపం అన్నట్టు.. #SaveHCU హ్యాష్ట్యాగ్తో ఫేక్ ప్రచారం చేస్తుండటంపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి అబద్దపు ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోలు ఎక్కడి నుంచి మొదట వైరల్ చేస్తున్నారో గుర్తించే పనిలో ఉన్నామని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతీ విషయాన్ని నమ్మొద్దని.. గుడ్డిగా షేర్లు చేయొద్దని సూచిస్తున్నారు.