Inter Failed Students Suicides(Telangana today news): తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విద్యార్థుల జీవితాలను బలితీసుకున్నాయి. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఫెయిలైనట్లు కాదని, మళ్లీ పరీక్షలు రాసి పాస్ అవ్వొచ్చని ఒక పక్క తల్లిదండ్రులు, మరోపక్క నిపుణులు చెబుతూనే ఉన్నా.. కొందరు విద్యార్థులు మాత్రం మనస్తాపానికి గురై.. బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒక్కరోజులోనే 8 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి.. తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని మిగిల్చారు.
మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన 16 ఏళ్ల ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అలాగే నస్పూర్ మండలానికి చెందిన మరో విద్యార్థిని రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. మొబైల్ సిగ్నల్ కోసమని ఇంటి పై అంతస్తుకు వెళ్లిన ఆమె.. ఫ్యాన్ కు ఉరివేసుకుంది.
Also Read : డాక్టర్ ఆత్మహత్య, భర్తతో గొడవ, ఏమైంది?
మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన విద్యార్థిని సీఈసీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఎకనామిక్స్ సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడంతో వ్యవసాయబావిలో దూకి సూసైడ్ చేసుకుంది. డోర్నకల్ మండలం చిల్కోడుకు చెందిన మరో విద్యార్థిని బైపీసీ ఫస్టియర్ లో ఫెయిలై ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మంజిల్లా ముదిగొండకు చెందిన మరొక విద్యార్థిని ఫస్టియర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఫెయలవ్వడంతో మనస్తాపంతో చెరువుగట్టు వద్ద ఉరివేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో, రంగారెడ్డి జిల్లా హైదర్ గూడలో ఫస్టియర్ విద్యార్థులు, భద్రాచలంలో సెకండియర్ విద్యార్థిని ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన కారణంగా.. మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. మళ్లీ పరీక్షలు రాసి పాస్ అవ్వొచ్చన్న ఒక్క ఆలోచన వారికి రాకపోయింది. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్నిచ్చి.. అనంత లోకాలకు వెళ్లిపోయారు.