Fake High Court Summons :తెలంగాణలో హైడ్రా (HYDRAA) కూల్చివేతల అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం తీవ్ర దుమారం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్లకు తెలంగాణ హైకోర్టు సమన్లు జారీ చేసిందంటూ ఒక నోటీసు నెట్టింట వైరల్ అయ్యింది. అయితే, ఈ నోటీసు పూర్తిగా నకిలీ (Fake) అని తేలింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైరల్ అయిన ఆ నకిలీ పత్రంలో.. ఏప్రిల్ 12, 2026 తేదీన హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నుండి అర్జెంట్ జ్యుడీషియల్ నోటీసు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కూల్చివేతల్లో నిబంధనలు పాటించలేదని, బాధితుల హక్కులను కాలరాశారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆ ఫేక్ నోటీసులో సృష్టించారు. అంతేకాకుండా, కూల్చివేసిన ఆస్తుల వివరాలను తక్షణమే సమర్పించాలని కోర్టు ఆదేశించినట్లుగా ఆ పత్రాన్ని రూపొందించారు.
హైకోర్టు పేరుతో ఇలాంటి తప్పుడు పత్రాలను సృష్టించి ప్రభుత్వంపై విషప్రచారం చేయడంపై కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత న్యాయస్థానం పేరును వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫేక్ నోటీసుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఈ తప్పుడు నోటీసును ఎవరు సృష్టించారు? ఏయే సోషల్ మీడియా గ్రూపుల్లో ఇది వైరల్ అయ్యింది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఫేక్ నోటీసులను సర్క్యులేట్ చేసే వారిపై ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా తన విధులను చట్టప్రకారమే నిర్వహిస్తోందని, ఇలాంటి అవాస్తవ ప్రచారాలతో తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది.
Read Also: 1986 చట్టం రద్దు చేస్తూ సర్కార్ సంచలన గెజిట్.. అమల్లోకి కొత్త చట్టం..?