Mystery Temples: శ్రీరాముడు వనవాస కాలంలో అనేక ప్రాంతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఆ రామచంద్రుని గుర్తుగా ఆయా ప్రదేశాల్లో రామాలయాలు వెలిశాయి. భక్తుల పాలిట కల్పతరువులుగా నేటికీ అవి విలసిల్లుతున్నాయి. ఆ ఆలయాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రామాయణంలో చెప్పిన ఘట్టాలు, జరిగిన ప్రదేశాలు భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అక్కడ వెలసిన రామాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. అహల్య శాప విమోచనం పొందిన ఆశ్రమం, రామభద్రుడు గుహుడ్ని గుండెలకు హత్తుకున్న ప్రాంతం, సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన నెలవు, శూర్పనక ముక్కు కోసిన ప్రాంతం ఇలా ఆ శ్రీరాముడు నడయాడిన ఎవ్వరికీ మరెన్నో ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముని జన్మస్థలంగా అయోధ్య చరిత్రకెక్కింది. బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగానూ దీన్ని అభివర్ణిస్తారు. అవతార పరిసమాప్తి సమయంలో రామచంద్రుడు ఇక్కడి సరయూ నదిలో మునిగి వైకుంఠానికి చేరుకున్నాడని ప్రజల నమ్మకం.
ఉత్తరప్రదేశలోని ఫైజాబాద్ ప్రాంతంలోనే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడని చరిత్ర చెబుతోంది. గంగానదికి ఉపనది అయిన ఘాఘ్రా నది ఒడ్డున ఫైజాబాద్ ఉంది. రాముడే విష్ణువుగా ఇక్కడే భూమిలో కలిసిపోయాడని స్థానికంగా చెబుతుంటారు.
ఉత్తరప్రదేశలోని అలహాబాద్ సమీపంలో శృంగభేరిపురం ఉంది. కోదండ రామునికి గుహుడు అపరభక్తుడే కాదు మంచి స్నేహితుడు కూడా. అరణ్యవాసానికి వెళుతున్న సీతా రామ లక్ష్మణులను గుహుడు గంగానదిని దాటించింది ఇక్కడే. రాములోరు తన మిత్రుడిని గుండెలకు హత్తుకున్న చోటు కూడా ఇదేనట.
కర్ణాటకలోని బెల్గావ్కు సమీపంలో సర్బన అనే ప్రాంతం ఉంది. రామ లక్ష్మణులు ఆ ప్రాంతంలోని అరణ్యంలో తిరుగాడుతుండగా ఓ సరోవరం కనిపిస్తుంది. అదే పంపా సరోవరం. దీని పక్కనే శబరి నివసిస్తూ ఉండేది. దశరథ తనయుడ్ని చూసిన శబరి భక్తిపారవశ్యంతో ఆయన పాదాలకు మొక్కి, మధుర ఫలాలను వారికి అందించింది ఇక్కడేనట.
ఉత్తర, మధ్య ప్రదేశ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. పచ్చని ప్రకృతి శోభతో అలరారే ఈ ప్రాంతంలోనే వనవాస వేళ సీతారాములు తిరుగాడినట్టు చెబుతారు. స్నాన, తపమాచరించిన ప్రదేశాలతో పాటు, వాళ్లు విశ్రాంతి తీసుకున్న కుటిరాలు ఇక్కడ కనిపిస్తాయి. అందమైన మందాకిని నది చూపరులను ఆకట్టుకుంటుంది.
ఇది బిహార్లోని ప్రాంతం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు అస్త్ర విద్యలు ఇక్కడే ఉపదేశించారని చెబుతారు. ఈ ప్రాంతంలోనే తాటక సంహారం జరిగిందట. బక్సర్ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహిరౌలి ప్రాంతంలో అహల్య శాప విమోచనం చెందిన ప్రాంతంగా భావిస్తారు.
లక్ష్మణుడు శూర్పణక ముక్కుచెవులు కోసిన స్థలంగా పంచవటిని చెప్పుకుంటారు. అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు ఇక్కడ కొన్నాళ్లు ఉన్నట్టు ఇక్కడి నుంచి సీతమ్మ వారిని రావణుడు అపహరించినట్టు చెప్తుంటారు. ఇక్కడికి దగ్గరలోనే త్ర్యయంబకేశ్వర్ ఉంది. అక్కడే గోదావరి నది జన్మస్థలం ఉంది.
ధనుష్కోటి, రామేశ్వరం: ఈ ప్రాంతం తమిళనాడులో ఉంది. రావణుని సోదరుడు విభీషణుడు రామమూర్తిని శరణు కోరిన స్థలం ఇదే.
సీతామర్హి (బిహార్): ఇక్కడే సీతాదేవి భూమిలో దొరికిన చోటుగా చెప్తుంటారు.
సీతాదేవి భూమాతాలో ఐక్యం అయ్యింది ఈ ప్రదేశంలోనే. అలహాబాద్, వారణాసిలను కలిపే రెండో జాతీయ రహాదారికి 4 కిలోమీటర్ల దూరంలో సీతా సమాహిత స్థల్ ఉంటుంది. సీతా స్మారక విగ్రహం ఇక్కడే ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సీతామారి అని కూడా పిలుస్తారు. సీతా భూమిలో ఐక్యం అయ్యే దృశ్యాన్ని కళ్లకు కడుతూ ఓ విగ్రహం కూడా ఉంటుందిక్కడ…!
అలాగే భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థ, రామగిరి, దండాకారణ్యం వంటి ఎన్నో ప్రదేశాలు రామాయణ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.