Bhatti Vikramarka: ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుపేదల పక్షపాత ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైరా పట్టణం బస్టాండ్ కూడలి వద్ద దాదాపు నాలుగు దశాబ్దాలుగా రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్న దాదాపు 100 కుటుంబాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డున పడేసింది. దుకాణాలను పునర్నిర్మాణం చేపిస్తామని నెపం పెట్టి గత బీఆర్ఎస్ సర్కార్ అన్ని షాపులను కూల్చేసి ఆయా కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసింది.
జీవనోపాధి కోల్పోయిన వారంతా ఏళ్ల తరబడి గత ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. అయినా గత బీఆర్ఎస్ పాలకులు వారిపై ఏమాత్రం కనికరం చూపలేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం వైరా నుంచి మధిర వెళ్తున్న ఉపముఖ్యమంత్రి వాహనం వద్దకు వారంతా వచ్చి తమ ఆవేదనని బాధని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఉన్న స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరుపేదలకు జరిగిన అన్యాయాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించి చెప్పారు. అంతేకాక ఇక్కడ నిరుపేదలకి దుకాణాలు కట్టించేందుకు సుమారు 8 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని ఉప ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివరించారు.
జీవనోపాధి కోల్పోయి నెట్టుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకుంటున్న వారిని చూసిన ఉపముఖ్యమంత్రి వీరందరికీ తప్పకుండా న్యాయం చేయాలని చెప్పారు. దుకాణాల నిర్మాణంకు సంబంధించి పూర్తి అంచనాలతో కూడిన నివేదికను పంపాలని అధికారులను అక్కడే ఆదేశించారు. అంచనాలకు సంబంధించిన నివేదికలు రాగానే అనుమతులు మంజూరు చేస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hydra: హైడ్రా అదుర్స్ .. 1365 గజాల ప్రభుత్వ భూమి భూమిని కాపాడిన హైడ్రా!