Maoist Rehabilitation: జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన వినతి నమోదైంది. మాజీ మావోయిస్టు సభ్యురాలు వసంత అలియాస్ మమత సోమవారం కలెక్టర్ను కలిసి తన సమస్యలను విన్నవించుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వం నుండి రావాల్సిన రివార్డులు, ఇతర పునరావాస సౌకర్యాల కోసం ఆమె వినతిపత్రాన్ని సమర్పించారు.
వసంత భర్త పసుల రాంరెడ్డి మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేశారు. అయితే.. 2000 సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన ఓ పోలీస్ ఎన్కౌంటర్లో ఆయన మరణించారు. భర్త మరణించినప్పటికీ.. వసంత వెనకడుగు వేయకుండా పార్టీలోనే కొనసాగారు. దశాబ్దాల కాలం పాటు మావోయిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన ఆమె.. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది 2025 జనవరి 31న ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయారు.
ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిన ఆమె.. తన జీవనోపాధి కోసం ప్రభుత్వం నుండి లభించాల్సిన సహాయంపై కలెక్టర్కు మొరపెట్టుకున్నారు.
ఆమెపై గతంలో ఉన్న రివార్డు సొమ్మును తెలంగాణ , ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల నుండి వెంటనే మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా నివసించడానికి సరైన ఇల్లు లేదని.. తనకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద గృహాన్ని కేటాయించాలని విన్నవించారు. వృద్ధాప్యం, జీవన భృతి కోసం ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.
క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను కలెక్టర్కు వివరిస్తూ.. లొంగిపోయిన మాజీ నక్సలైట్ల పునరావాస ప్యాకేజీ కింద తనకు దక్కాల్సిన ఫలాలను త్వరితగతిన అందేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. నిబంధనల ప్రకారం ఆమె విన్నపాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ మావోయిస్టు వసంత అలియాస్ మమత
2000లో ఎన్కౌంటర్లో మరణించిన తన భర్త పసుల రాంరెడ్డి మృతి తర్వాత కూడా పార్టీలో కొనసాగి, 2025 జనవరిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయిన వసంత
తనకు రావలసిన… pic.twitter.com/UCGWB97cwW
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2026