BRS To TRS: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్).. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఉద్యమ పార్టీగా మొదలై.. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఈ పార్టీ పదేళ్లు అధికారంలో కొనసాగింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రంలో మళ్లీ మనదే అధికారమన్న ధీమా.. కేంద్రంలోని జాతీయ పార్టీలను ఢీకొట్టే సత్తా మాకూ ఉందని నిరూపించేందుకు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్పు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని అంతా భావించిన తరుణంలో పరిస్థితి తలకిందులైంది. అనూహ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. టీఆర్ఎస్ ఓటమికి ఇదో కారణంగా విశ్లేషకులు చెబుతుంటారు.
ఈ తరుణంలో కేసీఆర్ నోట మళ్లీ టీఆర్ఎస్ అని రావడం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ మళ్లీ TRSగా మారబోతోందా? అనే చర్చ మొదలైంది. నిన్న బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీగా ప్రస్తావించారు. కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ అన్నారా? పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆరే… మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చబోతున్నారా? అని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రాజేసి… నీటి ఉద్యమాలతో జనంలోకి వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టని కేసీఆర్.. ప్రస్తుతం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యారు. మరోవైపు పార్టీ పేరు మార్చడం వల్లే జనంలో పట్టుకోల్పోయామని గులాబీ నేతలు చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ నోటి నుంచే టీఆర్ఎస్ఎల్పీ అని రావడంతో… పార్టీ పేరు మార్పు ఖాయమంటున్నారు గులాబీ నేతలు.
తెలంగాణ వాదంతో ఏర్పడిన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేయడంతో గులాబీ నేతలు హర్ట్ అయ్యారు. పైకి చెప్పలేకపోయినా పార్టీ పేరు మార్చడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత టీఆర్ఎస్ అని ఉంటే గెలిచేవాళ్లమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కవిత పార్టీ నుంచి బయటకు రావడం చకచకా జరిగిపోయాయి.
Also Read: Jupally Krishna Rao: దద్దమ్మ పాలన.. లెఫ్ట్ అండ్ రైట్.. ఇచ్చిపడేసిన జూపల్లి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత అదే పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. వరుస పర్యటనలతో నిత్యం జనంలో ఉంటున్న కవిత.. బీఆర్ఎస్ పై డైరెక్ట్ అటాక్ చేస్తు్న్నారు. కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు, గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను ఎండగడుతున్నారు. కవిత సమస్యకు పరిష్కారం చూపితే పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని గులాబీ నేతలు కేసీఆర్ తో అన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ గా మారిన తర్వాత కవితతో కూడా సంప్రదింపులు ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది.