న్యూఇయర్ వేడుకలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు మాదాపూర్ డీసీపీ రితిరాజ్. ఈవెంట్స్ జరిగే చోట కచ్చితంగా ఫైర్ సేఫ్టీ కిట్ ఉండాలన్నారు. ట్రైన్డ్ వెయిటర్స్తో పాటు ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అయ్యే సిబ్బందితో మాత్రమే ఈవెంట్స్ నిర్వహించాలన్నారు. డీసీపీ రితిరాజ్. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతిపక్షం మైనర్ల చేత రప్పా రప్పా అంటూ బాధ్యతారహితంగా ఫ్లెక్సీలు పెట్టిస్తోందని హోం మంత్రి అనిత మండిపడ్డారు. జగన్ రెడ్డి చిన్నపిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచుతున్నారని.. గతంలో గంజాయి హబ్గా మారిన రాష్ట్రాన్ని ఇప్పుడు రౌడీ మూకల నుంచి కాపాడుతున్నామని తెలిపారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి కార్తీక్ అదృశ్యం కావడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. గత ఎనిమిది రోజులుగా బాబు ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మీర్పేట్లో బీటెక్ విద్యార్థిని విహారిక ఆత్మహత్య కలిచివేస్తోంది. నా చావు నీకు ప్రశాంతతనిస్తుంది అని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడం, కుటుంబ సభ్యుల వద్ద ఆమెను వదిలివెళ్లడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ వర్గపోరు ముదిరి.. బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ దాడిలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
నంద్యాల ఫారెస్ట్ ఎఫ్డి ఆఫీసు వద్ద మేదర కులవృత్తి దారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాము తయారు చేసిన వస్తువులను తరలిస్తున్న లారీలను అటవీ అధికారులు పట్టుకోవడాన్ని నిరసిస్తూ.. కర్నూలు-కడప జాతీయ రహదారిపై బైఠాయించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఎన్నికైన నూతన సర్పంచులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. మండల ఎంపీడీవో, ప్రత్యేక అధికారుల సమక్షంలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
జగిత్యాల జిల్లా బాలేపల్లి, పోరండ్ల గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న మూడు ఇళ్లతో పాటు హనుమాన్, ఎల్లమ్మ దేవాలయాల్లో అందినకాడికి దోచుకెళ్లారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. లింగాపూర్ పరిసరాల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పెద్దపల్లి ఫారెస్ట్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. పులి సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండలం అంబర్పేట గ్రామ శివారులో లేగ దూడపై పెద్దపులి దాడి చేసింది. ఐదు నెలల కాలంలో పులి రెండు సార్లు సంచరించడంతో.. ప్రజలు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు 9 ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు హేమంత్ బిర్యానీ సెంటర్లో తిన్న చికెన్ బిర్యానీ వల్ల ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. ఇంటికి వచ్చాక వాంతులతో ఇబ్బంది పడటంతో వారిని పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.
పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీలో జంగమహేశ్వరపురం గ్రామం తొలగింపుపై ఓటింగ్ ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ సభ్యులను అనుమతించిన పోలీసులు, వైసీపీ ఛైర్మన్ పోలు పవన్ను గేటు వద్దే అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దీనిని నిరసిస్తూ వైసీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.
కోనసీమ జిల్లా అమలాపురంలోని మెట్ల కాలనీలో దీపక్ రాజ్ అనే బిబిఎ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన దీపక్.. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. ఎద్దులవారిపల్లి, కాటప్పగారిపల్లి, మడుపోలూరు గ్రామాల్లో చొరబడిన గజరాజులు రైతులు పండించిన పంటలను నాశనం చేశాయి. ఏనుగుల నుంచి పంటలను కాపాడాలని గ్రామ ప్రజలు అటవీశాఖ అధికారులను కోరారు.
తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఈ పిటిషన్లను విచారించారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా, ఈ-కామర్స్ సంస్థలను కోర్టు ఆదేశించింది.
తోషాఖానా-2 కేసులో తనకు, తన భార్య బుష్రా బీబీకి 17 ఏళ్ల జైలుశిక్ష ఖరారైన నేపథ్యంలో దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలకు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చినట్లు ఇమ్రాన్ ఎక్స్ ఖాతాలో పోస్టు కనిపించింది. ప్రస్తుతం ఇమ్రాన్ కారాగారంలో ఉన్నారు. సామాజిక మాధ్యమాలను వినియోగించే వెసులుబాటు ఆయనకు లేదు. ఎక్స్లో పోస్ట్ పెట్టిందెవరనేది ప్రస్తుతానికి తెలియలేదు.
ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం కుడి ఇంజిన్లో లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన పైలట్లు.. దానిని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై గతంలో దాఖలు చేసిన ఫిర్యాదును ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈడీ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తనను ఎంతలా కుంగదీసిందో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తాజాగా వెల్లడించారు. గురుగ్రామ్లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆ ఓటమి తర్వాత క్రికెట్ను వదిలేయాలనే ఆలోచన వచ్చిందని.. కోలుకోవడానికి రెండు నెలలు పట్టిందని భావోద్వేగానికి లోనయ్యారు. తన ఏకైక లక్ష్యం ప్రపంచకప్ గెలవడమేనని ఆయన పేర్కొన్నారు.
రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ ఇటీవల రీరిలీజైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని రమ్యకృష్ణ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. మొదటిసారి నరసింహ సినిమాను థియేటర్లో చూసేశా అని రమ్యకృష్ణ క్యాప్షన్ పెట్టారు.