గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వస్తున్న నకిలీ సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం ప్రాణసంకటంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
నేరగాళ్లు పంపే ఏపీకే (APK) ఫైల్స్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయడం అత్యంత ప్రమాదకరం. వినియోగదారులు ఆ చిన్న యాప్ను డౌన్లోడ్ చేసిన వెంటనే మొబైల్ నియంత్రణ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దీనివల్ల ఫోన్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు అలాగే రహస్య సందేశాలు నేరుగా దొంగలకే చేరుతాయి. ఫలితంగా బాధితులకు తెలియకుండానే వారి ఖాతాల్లోని సొమ్ము మాయమవుతోంది.
మహారాష్ట్రలోని డోంబివాలి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉదంతం ఈ మోసాలకు నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ గ్యాస్ కంపెనీ ప్రతినిధులమని నమ్మబలికిన నేరగాళ్లు ఇద్దరు మహిళలకు ఫోన్ చేశారు. కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఒక ఏపీకే ఫైల్ పంపారు. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి వివరాలు నమోదు చేసిన కొద్దిసేపటికే వారి బ్యాంకు ఖాతాల నుంచి నాలుగు లక్షల రూపాయలు పోయాయి.
తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలను అస్సలు నమ్మకూడదు. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే గ్యాస్ వస్తుందని చెప్పే సందేశాల వెనుక కచ్చితంగా మోసం ఉంటుందని గుర్తించాలి. ఆకర్షణీయమైన ఆఫర్ల ఆశ చూపి బ్యాంక్ ఖాతా వివరాలు లేదా యూపీఐ పిన్ వంటివి అడిగితే స్పందించవద్దు.
గ్యాస్ బుకింగ్ లేదా కేవైసీ ప్రక్రియ కోసం ఎప్పుడూ అధికారిక యాప్స్ లేదంటే వెబ్సైట్లను మాత్రమే వాడాలి. ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించడం సురక్షితం. ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తత ఒక్కటే మార్గం. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: CM Revanth Reddy: నిరంతర జలధారగా మూసీ నది.. 20 టీఎంసీల గోదావరి నీటితో భారీ ప్రాజెక్టు!