GHMC News: మున్సిపాలిటీలు విలీనం తర్వాత చకచకా అడుగులు వేస్తోంది జీహెచ్ఎంసీ. అభివృద్ధిపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాదు సర్వీసులు సైతం ప్రజలకు వేగంగా అందేలా చర్యలు చేపడుతోంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రాపర్టీ టాక్స్ ఇకపై ఆన్లైన్లో ప్రజలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది.
వేగంగా అడుగులు వేస్తోన్న జీహెచ్ఎంసీ
ప్రపంచమంతా టెక్నాలజీని అంది పుచ్చుకుంటే దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఈ విషయంలో వెనుకబడిపోతోంది. పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం చాట్బాట్లు, AI సేవలు ఉపయోగించాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ. దేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన గ్రేటర్ హైదరాబాద్ సిటీ.. ఇకపై కొత్త పద్దతులను అవలంభిస్తోంది.
సర్టిఫికెట్లు, అప్లికేషన్లు, సర్వీస్ ట్రాకింగ్ కోసం వాట్సాప్ ఆధారిత సేవలు ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. దీనివల్ల నగరంలో సర్వీస్ డెలివరీ, ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరుస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పట్టణ ప్రణాళిక, సేవల పంపిణీ, ఆదాయ పెంపుదలకు మద్దతు ఇవ్వడానికి GHMC సమగ్ర GIS ఆధారిత వ్యవస్థను అమలు చేస్తోంది.
టెక్నాలజీతో మరిన్ని సేవలు, ఆ విధంగా జీహెచ్ఎంసీ అడుగులు
డ్రోన్ సర్వేలతో 5 సెం.మీ.ల స్పేషియల్ రిజల్యూషన్తో 650 చదరపు కిలోమీటర్లకు పైగా హై-రిజల్యూషన్ బేస్ మ్యాప్ను సిద్ధం చేసింది. ప్రస్తుతం 2,503 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించిన GHMC అభివృద్ధికి ప్రణాళికలు జరుగుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
ఇంటింటికి GIS ఆధారిత సర్వేల ఆధారంగా దాదాపు 14 లక్షల ఆస్తులను కవర్ చేశారు. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య-PTIN, విద్యుత్ కనెక్షన్లు, నివాస లేదా వాణిజ్య నిర్మాణ వివరాలను సేకరించింది. ఇకపై ప్రాపర్టీ ట్యాక్సులు ఆఫ్లైన్లో చెల్లించే పద్దతికి గుడ్ బై చెప్పేసింది. వివిధ రకాల పన్నులు కట్టేవారు నేరుగా ఆన్లైన్లో చేయాలని నిర్ణయం తీసుకుంది.
ALSO READ: ముందు నీళ్లు.. ఇప్పుడు యూరియా, గులాబీ క్లారిటీ మిస్
పాత GHMC లో క్యాష్ పేమెంట్ల విధానాన్ని గతంలో రద్దు చేశారు. అయితే గ్రేటర్లో కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల పరిధిలో ఆన్లైన్లో పేమెంట్ చేయించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ముఖ్యంగా ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్, VLT కూడా ఆన్ లైన్లో నేరుగా చెల్లించవచ్చన్నమాట.