Gutha Sukender Reddy son Amith joined Congress(TS politics): లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కారుకి రాంరాం చెప్పేశారు.. చెబుతున్నారు కూడా. నేతలు వెళ్లిపోవడం వెనుక పార్టీ వ్యవహారశైలే కారణమని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మనసులోని మాటను బయటపెట్టారు.
ముఖ్యనేతలు ఒంటెద్దు పోకడలకు పోతున్నారుని ఆరోపించారు. ఎన్నికలకు ఆరు నెలలు ముందు కనీసం ఎమ్మెల్యేకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది మరో కారణం. నల్గొండ నుంచి ఈసారి గుత్తా తన కొడుకు అమిత్ ను బరిలోకి దింపాలని ప్లాన్ చేశారు. అయితే నేతల మధ్య విభేదాలతో వెనక్కి తగ్గిపోయారు. తాజాగా గుత్తా చేసిన వ్యాఖ్యలు కారు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. రేపోమాపో గుత్తా సుఖేందర్రెడ్డి సొంత గూటికి వెళ్లిపోవచ్చిని నేతలు అంటున్నారు.
ఇందులోభాగంగా గుత్తా కొడుకు అమిత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో అమిత్ భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి కోమటిరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్చౌదరి ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
నేతలు పార్టీలోకి రావడంపై ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ నేతలకు క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి వచ్చే నేతలను ఆపొద్దని పక్షం రోజుల కిందట కేసీ వేణుగోపాల్ నేతలకు దిశానిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని అంటున్నారు. అయితే గుత్తా రావచ్చని కాకపోతే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లోని మరో వర్గం అడ్డుకుంటోందన్న వాదన లేకపోలేదు.
ALSO READ: ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్.. కేసీఆర్ ఇంకా..
హైకమాండ్ చెప్పిన తర్వాత నేతలు అడ్డుకునే ప్రసక్తే లేదని అంటున్నారు పలువురు నేతలు. ఎన్నికలకు కేవలం డజను రోజులు మాత్రమే ఉన్నాయి. ఈలోగా కారు నుంచి ఇంకెంత మంది నేతలు బయటకు వస్తారో చూడాలి.