Hanumakonda School Bus Accident: హనుమకొండ జిల్లాలో సోమవారం సాయంత్రం ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. దామెర మండలం ఒగ్లాపూర్ సమీపంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సును ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అయితే బస్సు డ్రైవర్తో పాటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో స్కూల్ బస్సులో ఉన్న 38 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని ఏకశిలా స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుని ఊరుగొండ గ్రామానికి వెళ్తోంది. ఒగ్లాపూర్ శివారుకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి నేరుగా స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు అతివేగంగా ఉందని, కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని చిన్నారులు భయాందోళనతో కేకలు వేశారు. అదృష్టవశాత్తూ బస్సు పల్టీ కొట్టకపోవడంతో విద్యార్థులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సు నుండి కిందకు దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే, బస్సు డ్రైవర్, కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
దామెర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కారులో మద్యం సీసాలు లభించాయా లేదా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. అతివేగం.. మద్యం మత్తులో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. స్కూల్ బస్సులను ఢీకొట్టే ఇలాంటి ఘటనలు పదేపదే జరగడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం.. గేటు పగలగొట్టి లోపలికి దూసుకెళ్లిన కారు!