తెలంగాణలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. వరుసగా బీఆర్ఎస్ నాయకులకు అందుతున్న సిట్ (SIT) నోటీసుల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.
డైవర్షన్ పాలిటిక్స్ పై విమర్శలు
‘నిన్న నాకు నోటీసు ఇచ్చారు, నేడు కేటీఆర్ నోటీసు ఇచ్చారు. ఇదంతా కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్’ అని హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన బొగ్గు స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ నోటీసుల డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చకు రావడంతో, ఆ భయంతోనే తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రతీకారం బలహీనుల ఆయుధం
రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ గుర్తుపెట్టుకో.. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం. దమ్మున్న నాయకుడి ఆయుధం ఎప్పుడూ ప్రజాపోరాటమే’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటూ బలహీనంగా వ్యవహరిస్తోందని, కానీ బీఆర్ఎస్ నాయకులు ధైర్యవంతులని, ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తారని స్పష్టం చేశారు. నోటీసులకు సమాధానం చెప్పడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని, అయితే రేపు ప్రజా కోర్టులో సమాధానం చెప్పడానికి రేవంత్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
హామీల అమలుపై పోరాటం
ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది నాయకులను విచారణ పేరుతో వేధించినా వెనక్కి తగ్గేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ‘బిడ్డా రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఆరు గ్యారెంటీలు. 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని ఆయన ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలను, వాటాల పంచాయతీలను బట్టబయలు చేస్తూనే ఉంటామని, బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
ALSO READ: KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. కేటీఆర్కు సిట్ నోటీసులు, ఇక జైలుకేనా..?