తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) తన విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక మలుపుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్లోని ఆయన నివాసానికి చేరుకున్న అధికారులు 160 సీఆర్పీసీ (CRPC) కింద ఈ నోటీసులను అందజేశారు.
నోటీసుల ప్రకారం.. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ కేటీఆర్ను ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో అరెస్టయిన అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాల నేపథ్యంలో కేటీఆర్ను ప్రశ్నించాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు జైలులో ఉండగా.. రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. కేవలం రెండు రోజుల క్రితమే మరో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు సాగిన ఆ విచారణలో ఫోన్ ట్యాపింగ్ నెట్వర్క్, నిధుల మళ్లింపు, ఇతర అంశాలపై ఆయన్ను ప్రశ్నించారు. హరీశ్ రావు విచారణ ముగిసిన వెనువెంటనే కేటీఆర్కు నోటీసులు రావడం హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నోటీసులపై కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపటి విచారణలో కేటీఆర్ వెల్లడించే అంశాలు ఈ కేసులో మరిన్ని కీలక మలుపులకు దారితీసే అవకాశం ఉంది.
ALSO READ: Pawan Kalyan: కుట్రలను తిప్పికొడదాం.. పార్టీ ప్రతిష్ఠను కాపాడదాం.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు