మూసీ పునరుజ్జీవనం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పొట్ట కొడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే 4వేల కోట్లతో 32 ఎస్టీపీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మురుగునీటిని శుద్ధి చేయకుండా.. గోదావరి జలాలను తీసుకురాకుండా కేవలం ఇళ్లు కూల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం సాగుతోందని విమర్శించారు.
లక్షా 50 వేల కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కేవలం ‘లూటీఫికేషన్’ కోసమేనని హరీశ్ రావు ఆరోపించారు. రైతుల రుణమాఫీకి.. రైతు భరోసాకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. మూసీ కోసం భారీ నిధులు ఎక్కడి నుంచి తెస్తోందని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్.. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టి రియల్ ఎస్టేట్ దందాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఎటువంటి డీపీఆర్ (DPR) లేకుండా.. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చుని ప్రణాళికలు రచించడం తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఎద్దేవా చేశారు.
మూసీ పరివాహక ప్రాంతంలోని 10 వేల ఇళ్లను కూల్చివేసి లక్ష మందిని నిరాశ్రయులను చేసే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. ఏడీబీ (ADB) రుణం మంజూరైందని అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు చెప్పారని.. దీనిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని హెచ్చరించారు. భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాధితులకు సరైన పరిహారం ఇవ్వకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో బుల్డోజర్ రాజ్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందాకు సహకరిస్తున్నారా అని ఆయన నిలదీశారు.
ALSO READ: Jana Sena Party: జనసేన ఆవిర్భావ సభ రద్దు చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?