తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే గెలిచే సత్తా లేక తమ అభ్యర్థులను ప్రలోభపెట్టి తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలి వీస్తోందని, మరో రెండేళ్లలో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని హరీష్ రావు జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. ‘రేవంత్ రెడ్డి సీఎంగా వ్యవహరిస్తున్నారా లేక రౌడీ షీటర్లాగానా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైలు పట్టాలపై కూర్చున్నందుకు కేసీఆర్ను మెదక్ జైలులో పెట్టారని, ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నిస్తూ.. గతంలో జై తెలంగాణ అన్న వారిపై తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ది అని ఘాటుగా విమర్శించారు.
మెదక్ జిల్లా అభివృద్ధిపై స్పందిస్తూ జిల్లా కలలను నిజం చేసింది బీఆర్ఎస్ అని హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్ కు రైలు మార్గం, ఫోర్ లైన్ రోడ్లు, ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు అందించడం వంటి పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. సిద్ధిపేటతో సమానంగా మెదక్ను అభివృద్ధి చేశామని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో జిల్లాలో రౌడీయిజం, మతకలహాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 11 లోపు రైతుబంధు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ అని, తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్యాకేజీలు ఇస్తూ తెలంగాణకు గుండుసున్నా చుట్టారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టి పీసీసీ పదవి కొన్నారని వారి పార్టీ నేతలే చెప్పారని గుర్తు చేస్తూ, తన భాషను అదుపులో పెట్టుకోకపోతే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హరీష్ రావు విమర్శలను తిప్పికొడుతూ, బీఆర్ఎస్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందని.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే హరీష్ రావు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ఎద్దేవా చేశారు.
ALSO READ: HYDRAA: మురుగు నీరు మాయం.. వాకింగ్ ట్రాక్లు సిద్ధం.. చెరువుల సుందరీకరణపై హైడ్రా ఫోకస్