Harish Rao: నదీ జలాల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చేతకానితనం వల్ల కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. నీటి హక్కుల సాధనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు.
గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల హక్కులను గత ప్రభుత్వం శాశ్వతంగా కాపాడిందని హరీశ్ రావు గుర్తు చేశారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి సుమారు 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ఏపీలోని టీడీపీ కూటమి కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతను ఆసరాగా చేసుకుని ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను దోచుకోవడానికి పక్కా స్కెచ్ వేసిందని విమర్శించారు.
జనవరి 30న ఢిల్లీలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశం మినిట్స్ ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చినా ప్రభుత్వం నెల రోజులుగా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. గోదావరిలో రాష్ట్రాల మధ్య కేటాయింపులు లేవని ఏపీ వాదిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం అంటే మన వాటాను వదులుకున్నట్టేనని ధ్వజమెత్తారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ను ధిక్కరించడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ నల్లమల్ల సాగర్ పనుల గురించి గర్వంగా చెబుతుంటే తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని ఎందుకు చెప్పించలేకపోయారని హరీశ్ రావు నిలదీశారు. కృష్ణా నదిలో 80 శాతం నీళ్లను ఏపీ తరలించుకుపోతున్నా నోరు మెదపని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మీటింగ్ మినిట్స్పై గట్టిగా అభ్యంతరం తెలిపి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని లేనిపక్షంలో ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.