Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను రాశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్లే పంపులు దెబ్బతిన్నాయని.. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టం గా కనిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ దుయ్యబట్టారు.
కృష్ణా జలాల నీటి వినియోగంలో తెలంగాణ వాటా గతంలో ఎన్నడు లేని విధంగా కనిష్ట స్థాయికి పడిపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. ఏపీ 74% వినియోగిస్తే.. తెలంగాణ 25% పరిమితం అయ్యిందని మండిపడ్డారు. రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడేసిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ ఆధారిత విద్యుత్ విధానాలతో సాగునీటి రంగానికి ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు. అందుకే రైతు డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని హరీశ్ రావు డిమాడ్ చేశారు.
భారీ మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడం వల్లే కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్ తో పాటు దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు, మోటార్లు తెబ్బతిన్నాయని హరీశ్ రావు అన్నారు. ఇలా చేయవద్దని గతంలోనే చెప్పినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవడమేనని హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే విద్యుత్ లభ్యత ఆధారంగా పంపింగ్ను పరిమితం చేయడం రాష్ట్ర జల హక్కులకు విరుద్ధమని మండిపడ్డారు.
నీటి వినియోగం తగ్గితే వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాలు, చేపల పెంపకం, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్లో ఏపీ 66 శాతం, తెలంగాణ 34 వాటాలు కలిగి ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. అయితే 2024-25లో ఆంధ్రప్రదేశ్ 72.73% నీటిని వినియోగించగా.. తెలంగాణ కేవలం 27.27% మాత్రమే వినియోగించిందని ఆరోపించారు. నీటి లభ్యత అధికంగా ఉన్నప్పటికీ తెలంగాణ తన వాటా నీటిని కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందని మండిపడ్డారు.
Also Read: వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్, ఫేస్బుక్ లాగిన్ కోసం.. క్రేజీ టెక్నాలజీ!
మరోవైపు బీఆర్ఎస్ తరపున బహిరంగ లేఖలో కొన్ని డిమాండ్లను హరీశ్ రావు ఉంచారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని పట్టుబట్టారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి సూచించారు. రైతు డిస్కం ప్రతిపాదనను ఉపసంహరించుకొని.. కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణపై ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వాటికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Also Read: హార్డ్ vs సాఫ్ట్.. ఖరీదైన స్మార్ట్ ఫోన్కు.. ఏ కవర్ శ్రీరామరక్ష?