Pending Chalan: పెండింగ్ చలానాల వసూలు విషయంలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. పెండింగ్ చలానాలు చెల్లించాలంటూ వాహనదారులను పోలీసులు బలవంతపెట్టకూడదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా వాహనాలను ఆపి బైక్ కీలు లాక్కోవడం లేదా వాహనాలను నిలిపివేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
పెండింగ్ చలానాలు చెల్లించాలని వాహనదారులను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపెట్టకూడదని కోర్టు ఆదేశించింది. చలానాలు కట్టాలని బైక్ కీలు లాక్కోవడం లేదా వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం వంటి పనులు చేయకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు, వాహనదారులు తమంతట తాముగా స్వచ్ఛందంగా చలానాలు చెల్లిస్తామంటేనే పోలీసులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ వాహనదారులు చలానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, చట్టప్రకారం వారికి కోర్టు నోటీసులు జారీ చేయాలని పోలీసులకు సూచించింది.
ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలానాల పేరుతో వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ, వసూళ్ల కోసం పోలీసులు అనుసరిస్తున్న పద్ధతులు వాహనదారులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది.
చాలా వరకు పెండింగ్ చలానాలను ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ‘వర్చువల్ కోర్టు’ పోర్టల్లో పరిష్కరించుకోవచ్చు. కోర్టు ద్వారా వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మెజిస్ట్రేట్ సమక్షంలో మీ వివరణ ఇచ్చుకుని, జరిమానా మొత్తాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించే లోక్ అదాలత్ సమయాల్లో పెండింగ్ చలానాలపై భారీ రాయితీలు ప్రకటిస్తారు. ఆ సమయంలో చెల్లించడం లాభదాయకం.
Read Also: ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని తెలంగాణ మొత్తం కొడైకుస్తుంది.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు