తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కోడై కూస్తున్నా.. బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగట్టారు.
ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ కవిత స్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కవిత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆమె పేర్కొనడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ‘సొంత పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే కవిత ఫోన్ ట్యాపింగ్కు గురైందని ఆమె చెబుతుంటే, బీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముందుగా బీఆర్ఎస్ నాయకులు కవితకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రజలపై కనీస విశ్వాసం లేదని, కేవలం తమ అంతర్గత కలహాల కారణంగానే నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు దోషులు ఎవరో తేల్చకుండా, కేవలం దర్యాప్తుల పేరుతో కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసిందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అంతర్గత కలహాలతో ముక్కలైపోతోందని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పతనం దిశగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక కోల్ బ్లాక్ కేటాయింపుల వ్యవహారంపై కూడా బీజేపీ న్యాయపోరాటం చేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కక్కిస్తామని రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నారని, అయితే అన్ని విషయాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ALSO READ: Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందు హరీష్ రావు.. ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి!