Hyderabad News: బంగారం అక్రమ రవాణాపై ఎంత నిఘా పెట్టినా ఏదో రూపంలో చిక్కుతూనే ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. ఐరన్ బాక్సులో 11 గోల్డ్ బార్స్ పెట్టి తరలించారు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా వారంతా బుక్కయ్యారు. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో దాదాపు కోటిన్నర రూపాయలు. అసలు అధికారులు ఎలా గుర్తించారు?
శంషాబాద్ ఎయిర్పోర్టు భారీగా బంగారం పట్టివేత
మార్కెట్లో బంగారం ధర తారాజువ్వ మాదిరిగా ఎగిసిపడుతున్నాయి. 10 గ్రాముల ధర దాదాపు లక్షన్నర పైనే పలుకుతోంది. ఒకరోజు పెరిగినా, మరొక రోజు తగ్గుతోంది. ఏ మాత్రం దిగిరావడం లేదు. అందుకు అంతర్జాతీయ పరిణామాలు కూడా ఓ కారణం. ఇదే అదునుగా పసిడిని అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు రెచ్చిపోతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను కన్వీన్స్ చేసి వారితో అక్రమ రవాణాకు తెరలేపారు.
షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ట్రావెల్ వద్ద నుండి రూ. 1.55 కోట్ల విలువైన గోల్డ్ సీజ్ చేశారు. గల్ఫ్ నుంచి బంగారం వస్తుందన్న సమాచారం మేరకు షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని క్షుణ్నంగా పరిశీలించారు అధికారులు. చివరకు అనుమానం వచ్చి ఐరన్ బాక్సుని చెక్ చేశారు. అది ఓపెన్ చూడగానే షాకయ్యారు అధికారులు. ఏకంగా అందులో 11 గోల్డ్ బార్స్ బయటపడ్డాయి.
ఐరన్ బాక్సు ద్వారా స్మగ్లింగ్
వెంటనే ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. దీనివెనుక ప్రొద్దుటూరు స్మగ్లింగ్ గ్యాంగ్ ఉన్నట్లు తేలింది. శనివారం రాత్రి ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడ్ని నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ALSO READ: ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సరదా సంభాషణ వీడియో వైరల్
దీనికి సంబంధించి మొత్తం ముగ్గురిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం 1196.20 గ్రాములు. మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. 1.55 కోట్లు. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలను ఉపయోగిస్తున్నారు. దుబాయ్, షార్జాల నుండి వచ్చే విమానాల్లో ఈ తరహా స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని కేరళ తర్వాత ఎక్కువగా శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టుబడుతున్నట్లు రకరకాల నివేదికలు చెబుతున్నాయి.