AP TG CMs: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక వేదికపై కనిపించారు. ఇద్దరు సీఎంలు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు సీఎంలు కలిసి ఒకచోట కనిపించారు. సీఎంలు ఒకే సీట్లో పక్క పక్కన కూర్చొని సరదాగా నవ్వులు చిందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ ఒకే సీటులో కూర్చొని సరదాగా సంభాషించుకోవడం ఆసక్తిగా మారింది. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారు, తెలంగాణా గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు.#ChandrababuNaidu… pic.twitter.com/8tT0UoqkRI
— Telugu Desam Party (@JaiTDP) November 16, 2025
రామోజీరావు అక్షర యోధుడని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం రామోజీరావు దేనినైనా వదులుకునేవారన్నారు. రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ఆలోచన ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ‘రామోజీ ఎక్స్లెన్స్ జాతీయ అవార్డులు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
జర్నలిజం,మానవ సేవ, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళ-సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్ విభాగాల్లో రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డులు ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రజల పక్షాన బలంగా పోరాడిన యోధుడు రామోజీరావు అని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రతిపక్షం బలహీనంగా ఉన్న సమయంలో రామోజీరావు ప్రతిపక్షం పాత్ర పోషించారని చెప్పారు.
తెలంగాణకు రామోజీ ఫిలిం సిటీ ఫోర్త్ వండర్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రామోజీ సంస్థలు తెలంగాణకు గర్వకారణంగా నిలిచాయన్నారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ఆలోచన అభినందనీయమన్నారు. రామోజీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణ అందులోనూ హైదరాబాద్ నగరమంటే నాలుగు అద్భుతాలు గుర్తొస్తాయని, వాటిల్లో మొదటి మూడు ఛార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ కాగా నాలుగోది రామోజీ ఫిల్మ్సిటీ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు రామోజీ ఫిలిం సిటీ ఎంతగానో తోడ్పాటునందించిందన్నారు.