Hyderabad Cyber Crime: సైబర్ నేరాలను అరికట్టడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. 2026 జనవరి మాసంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుతో మొత్తం 26 కీలక కేసులను ఛేదించినట్లు అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు వెల్లడించారు.
జనవరి నెలలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మొత్తం 117 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన నిందితుల మోడస్ ఆపరాండీ (MO) పరిశీలిస్తే.. అందులో ఇన్వెస్ట్మెంట్ మోసాలు 15 కేసులు, డిజిటల్ అరెస్ట్ 02 కేసులు, సోషల్ మీడియా (CSAM–POCSO) 04 కేసులు, బిజినెస్, గేమింగ్ , జాబ్ ఫ్రాడ్స్.. 05 కేసులు నమోదయ్యాయి.
పోలీసుల సత్వర చర్యల వల్ల బాధితులకు చెందిన రూ. 71,91,371 మొత్తాన్ని విజయవంతంగా రీఫండ్ చేయించడం జరిగింది. అరెస్ట్ అయిన నిందితులకు దేశవ్యాప్తంగా 86 కేసులతో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా సుమారు రూ. 65 కోట్ల భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు, 57 చెక్కు పుస్తకాలు , ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
యూకేలో ఇంజనీర్గా నటిస్తూ ఓ మహిళా నిందితురాలు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా హైదరాబాద్కు చెందిన వ్యక్తిని నమ్మించి ‘Bakktcoin’ అనే ఫేక్ క్రిప్టో ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టించింది. బాధితుడు రూ. 11.20 లక్షలు కోల్పోగా.. ఈ కేసులో నిందితులకు సిమ్ కార్డులు సరఫరా చేసిన ఏపీకి చెందిన గెడ్డవలస రవికిరణ్, చోడిపల్లి గంగరాజులను అరెస్ట్ చేశారు.
జనవరిలో జోనల్ సైబర్ సెల్స్ 1706 ఫిర్యాదులను స్వీకరించగా.. ‘సి-మిత్ర’ చొరవతో 315 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ విభాగం ద్వారా మరో 13 మందిని అరెస్ట్ చేసి.. రూ. 10.65 లక్షల నగదును బాధితులకు వెనక్కి ఇప్పించారు.
సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్ గారు సూచించారు. ఉన్నతాధికారుల పేర్లతో వచ్చే వాట్సాప్, సోషల్ మీడియా మెసేజ్లను నమ్మి డబ్బులు పంపవద్దు. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో అధిక లాభాలు ఆశ చూపే స్కీమ్లను నమ్మకండి. కేవలం SEBI గుర్తింపు పొందిన యాప్స్ ద్వారానే పెట్టుబడులు పెట్టండి. బ్యాంకుల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం గాని.. ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయడం గాని చెయ్యవద్దు. సీబీఐ, ఈడీ లేదా పోలీస్ అధికారులు ఫోన్ కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానం చట్టంలో లేదు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పగానే భయపడి డబ్బులు పంపకండి.
మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల మీ సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది.
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం
జనవరిలో 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన 26 సైబర్ క్రైమ్ కేసులను ఛేదించిన పోలీసులు
అరెస్టైన నిందితులకు దేశవ్యాప్తంగా 86 కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తింపు
నిందితుల… pic.twitter.com/7h8SRVnDuy
— BIG TV Breaking News (@bigtvtelugu) February 8, 2026