DCP Aravind Babu: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబుపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చెయ్యాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెటా ఇండియా హెడ్ పై కేసులు నమోదు చెయ్యటమే దీనికి దారి తీసిందని సమాచారం.
నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు మద్దతుగా నిలవటంతోపాటు నిరసనలు జరిపారు. కాగా, ఆ సమయంలో కొందరు ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్, అభ్యంతరకరమైన కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.
Also Read: లీటర్ పెట్రోల్ రూ. 84కే ఇవ్వాలి! E20 వివాదంపై కేజ్రీవాల్ సంచలన డిమాండ్లు
దీనిపై బీజేపీ మద్దతుదారులు సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మెటా ఇండియా హెడ్ తో పాటు పలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే, విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం మద్దతు ఇచ్చిన క్రమంలో కేసులు నమోదు చేయడంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులతో పాటు పోలీస్ బాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కేసుల నమోదు కు దారితీసిన పరిస్థితులపై సమాచారం సేకరించిన ప్రభుత్వం డీసీపీ అరవింద్ బాబును విధులనుంచి తప్పిస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.