Hyderabad Cyber Crime: కొత్త సంవత్సర ఆరంభంలోనే హైదరాబాద్లో భారీ సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మాయా పద్ధతులతో అమాయకులను వలలో పడేస్తూనే ఉన్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన.. 81 ఏళ్ల వృద్ధ వ్యాపారవేత్త నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.7 కోట్ల 12 లక్షల 80 వేల రూపాయలు కాజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడికి డిసెంబర్ చివరన ఫేక్ ఫోన్ కాల్ వచ్చింది. తాము కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు అంటూ పరిచయం చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఆయన పేరుతో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, మనీ లాండరింగ్ కేసులో ఆయన ప్రమేయం ఉందని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెబితే అరెస్ట్ తప్పదని హెచ్చరిస్తూ, తక్షణమే విచారణ కోసం డిజిటల్ అరెస్ట్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఫోన్ కాల్కు తోడు వీడియో కాల్లో నకిలీ ఐడీలు, ఫేక్ అధికారుల ఫోటోలు, నకిలీ నోటీసులు చూపించి బాధితుడిని భయాందోళనకు గురిచే చేసినట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండానే అక్రమ లావాదేవీలు జరిగాయని ఆ వ్యపారవేత్త నమ్మి, నేరగాళ్లు చెప్పిన మాటలను విన్నాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే తన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ‘సేఫ్ అకౌంట్కి బదిలీ చేయాలని, విచారణ పూర్తయిన తర్వాత మొత్తం తిరిగి ఇస్తామని వారు హామీ ఇచ్చారు.
నేరగాళ్ల మాటలకు భయపడి బాధితుడు కొద్ది రోజుల్లోనే తన ఖాతాల నుంచి దశలవారీగా భారీ మొత్తాన్ని బదిలీ చేశాడు. ఈ మొత్తం కలిపి రూ.7 కోట్ల 12 లక్షల 80 వేలుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొంతకాలం తర్వాత కూడా డబ్బు తిరిగి రాకపోవడంతో, అనుమానం వచ్చిన బాధితుడు కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో మోసం బయటపడింది.
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఇది అంతర్జాతీయ సైబర్ ముఠా పని అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ సిమ్ కార్డులు, వర్చువల్ అకౌంట్లు, క్రిప్టో లావాదేవీల ద్వారా డబ్బును విదేశాలకు మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Also Read: పంజాబ్లో వింత ఘటన.. పెళ్లికి 14 రోజుల ముందు ఫ్రెండ్తో పారిపోయిన వధువు!
ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫేక్ కాల్స్ వంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వచ్చినప్పుడు వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.