హైదరాబాద్ నగర మకుటంలో మరో మణిహారం చేరబోతోంది. ప్రకృతి ప్రేమికులను, సాహస క్రీడల అభిమానులను అలరించేలా కొత్వాల్గూడలో రూపుదిద్దుకున్న ఎకో పార్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భాగ్యనగర వాసులకు నిత్యం ఆహ్లాదాన్ని, సంతోషాన్ని పంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్గూడ ఎకో పార్క్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. దాదాపు 85 ఎకరాల విస్తీర్ణంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ పార్కుకు సంబంధించిన తాజా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చని ప్రకృతి ఒడిలో, అత్యాధునిక సౌకర్యాలతో పర్యాటకులను కట్టిపడేసేలా ఈ పార్కును తీర్చిదిద్దారు.
దేశంలోనే అతిపెద్ద పక్షిశాల, అక్వేరియం..
ఈ ఎకో పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ఇక్కడి పక్షిశాల. సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పక్షిశాల దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందనుంది. ఇందులో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల నుంచి తీసుకొచ్చిన దాదాపు 1500 రకాల పక్షులు కొలువుదీరాయి. పక్షుల కిలకిలరావాల మధ్య నడవడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీనితో పాటు, దేశంలోనే అతిపెద్ద అక్వేరియంను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
తొలి అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం..
నగరంలోనే మొట్టమొదటిసారిగా ఈ పార్కులో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియంను అందుబాటులోకి తెచ్చారు. పర్యాటకులు ఈ టన్నెల్లో నడుస్తూ తమ చుట్టూ ఉన్న జలచరాలను చూడవచ్చు. స్టార్ ఫిష్, ఏంజెల్ ఫిష్, ఈల్స్, సీ-హార్స్ వంటి సుమారు 3 వేల రకాల సముద్ర జీవులు ఇక్కడ సందర్శకులను కనువిందు చేయనున్నాయి. సముద్ర గర్భంలో ఉన్నామనే భావన కలిగించేలా దీనిని రూపొందించారు.
https://twitter.com/abhinavaduri9/status/2015609214308426121
కేవలం ప్రకృతి ఆస్వాదనకే పరిమితం కాకుండా, యువతను ఆకట్టుకునేలా భారీ అడ్వెంచర్ జోన్ను అభివృద్ధి చేశారు. ఇందులో జిప్ లైన్, క్లైంబింగ్ వాల్, స్కై బ్రిడ్జి, రోలర్ కోస్టర్, జాయింట్ స్వింగ్, 360 డిగ్రీస్ ఫ్లయింగ్ సైకిల్ వంటి సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు సస్పెన్షన్ బ్రిడ్జి, బంగీ ట్రాంపొలైన్ వంటివి వారాంతాల్లో పర్యాటకులకు అసలైన వినోదాన్ని అందిస్తాయి.
మౌలిక సదుపాయాలు..
పర్యాటకుల సౌకర్యార్థం పార్కులో భారీ ఫుడ్ కోర్ట్, పిక్నిక్ జోన్లు, విభిన్న రకాల పూల తోటలను ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ (ORR) కు ఆనుకుని ఉండటంతో ప్రయాణ సౌలభ్యం కూడా మెండుగా ఉంది. కుటుంబ సమేతంగా గడిపేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు ఇది హైదరాబాద్లోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.