Liquor Scam: స్వేచ్ఛ బ్యూరో: ఖరీదైన లిక్కర్ ఖాళీ బాటిళ్లను సేకరించి చీప్ లిక్కర్ నింపుతూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అమ్ముతున్న ముఠాను ఎక్సయిజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెంది ప్రస్తుతం అత్తాపూర్ లో నివాసముంటున్న శరత్ చంద్ర సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తేలికగా డబ్బు సంపాదించేందుకు ఖరీదైన లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి అమ్మాలని పథకం వేసుకున్న శరత్ చంద్ర లిక్కర్ ఈవెంట్లలో పని చేసే ఒడిశాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్ లతో పరిచయం పెంచుకున్నాడు. వారి ద్వారా వేల రూపాయల ధర పలికే రాయల్ సెల్యూట్, షివాస్ రీగల్, గ్లెన్ ఫ్లెడ్ విచ్ ఖాళీ బాటిళ్లను సేకరించే వాడు.
ఆ తరువాత కొండాపూర్ గుట్టల బేగంపేటలో అద్దెకు తీసుకున్న గదికి ఈ సీసాలను ముగ్గురు కలిసి తీసుకెళ్లేవారు. అక్కడ తక్కువ ధరలకు దొరికే చీప్ లిక్కర్ లో నీళ్లు కలిపి బాటిళ్లలో నింపేవారు. క్యాప్ లను అమర్చేవారు. ఆ తరువాత శరత్ చంద్ర తనకు పరిచయం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు తక్కువ ధరకే ప్రీమియం లిక్కర్ బాటిళ్లు వచ్చాయని వాటిని అమ్మేవాడు.
21వేల రూపాయలకు పైగా ధర ఉన్న రాయల్ సెల్యూట్ విస్కీ బాటిల్ ను 8వేలకు, 9వేల రూపాయలకు పైగా రేటు ఉన్న షివాస్ రీగల్ విస్కీని 4వేలకు విక్రయిస్తూ వస్తున్నాడు. ఈ వ్యవహారంపై పక్కాగా సమాచారాన్ని సేకరించిన రంగారెడ్డి ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ సుభాష్ చందర్, ఎస్ఐ అఖిల్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి లాలు ప్రసాద్ బిస్వాల్, శరత్ చంద్రను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రాజేశ్వర్ మెహర్ కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం కొండాపూర్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: 179 ఏళ్ల నమ్మకం.. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష