Fish Prasadam: స్వేచ్ఛ బ్యూరో: జూన్ 8న మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా బాధితులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనున్న చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన విస్తృత ఏర్పాట్లపై కలిసి గురువారం మంత్రి పొన్నం సమీక్షించారు.
వచ్చే నెల 8న చేప ప్రసాదం పంపిణీ
వచ్చే నెల 8వ తేదీన ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు మృగశిర కార్తి ముహూర్తంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న 179 ఏళ్ల చరిత్ర కలిగిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అన్ని శాఖలు కలిసి సమన్వయంతో చేయాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మొహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలా, వివిధ శాఖల అధికారులు, బత్తిని కుటుంబ సభ్యులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.. 2026-27 నుండి కొత్త రూల్స్ ఇవే!
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 179 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసం, నమ్మకంగా కొనసాగుతున్న చేప ప్రసాదం కార్యక్రమం హైదరాబాద్ నగరంలో ఓ ప్రత్యేకతగా నిలిచిందన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు, ఆస్తమా బాధితులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఈ సారి సుమారు లక్షలాది మంది ప్రసాదం స్వీకరించే అవకాశం ఉందన్నారు. గత అనుభవాలను సమీక్షించి లోపాలను సరిదిద్దుకుంటూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అధికారులకు మంత్రి ఆదేశాలు
భారీ జన సామర్థ్యం దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, క్రౌడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని సూచించారు. పిక్పాకెటింగ్, చోరీలు, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో రాత్రంతా పూర్తి స్థాయి లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ ద్వారా అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులు, అవసరమైన మందులు, సీపీఆర్ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది , వాలంటీర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..
పోలీస్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, విద్యుత్, రెవెన్యూ, ఆర్టీసీ, రవాణా, ఫిషరీస్, అగ్నిమాపక, వైద్యారోగ్య, సమాచార శాఖ లు సమన్వయంతో పని చేస్తూ బ్యారికేడింగ్, క్యూ లైన్లు, వాటర్ప్రూఫ్ షెడ్లు, టెంట్లు, పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అవగాహన ప్రచారం, అదనపు బస్సు సర్వీసులు, అగ్నిమాపక భద్రత తదితర ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ 1847లో బత్తిని వీరన్న గౌడ్ ప్రారంభించిన ఈ చేప ప్రసాదం పరంపర 179 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసంతో కొనసాగుతుండటం విశేషమన్నారు.
చేపల సరఫరాపై ప్రత్యేక దృష్టి
ఇటువంటి సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన చేపలను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచాలని, అదనపు నిల్వ కూడా సిద్ధంగా ఉంచాలని ఫిషరీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమం అనంతరం కూడా పరిశుభ్రత చర్యలు సమర్థంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వివిధ ప్రాంతాలు, మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు విశ్వాసంతో చేప ప్రసాదం కోసం వస్తారని, ఇది అందరి కార్యక్రమమమని ఆయన వ్యాఖ్యానించారు.
సమావేశంలో స్పష్టమైన సూచన
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, ప్రాంతీయ సమాచార అధికారి రాములు, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్, హైదరాబాద్ ఆర్డీఓ రామకృష్ణ, అగర్వాల్ సమాజ్, జైస్వాల్ సమాజ్, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: తెలంగాణ డ్రింక్గా తాటి కల్లు.. మే 24న మ్యూజికల్ ఫెస్టివల్