Muthyalamma Temple: సికింద్రాబాద్ కుమ్మరి గూడలోని శ్రీముత్యాలమ్మ గుడిలో అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో సికింద్రాబాద్ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. వెంటనే ప్రభుత్వం స్పందించి స్థానిక శాసన సభ్యుడి విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందజేసే విధంగా వేద పండితులతో పునఃప్రతిష్ఠ చేసుకొని దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ఎక్కడైనా దేవాలయాలు, ప్రార్థన మందిరాల పట్ల రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఆ ముత్యాలమ్మ వారికి రెండు చేతులు జోడించి ప్రజలంతా సుఖ సంతోషాలతో.. ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. దేవాలయాలను కాపాడుకోవాలి.. విద్రోహం జరిగినపుడు అందరం కలిసి ఎదుర్కోవాలి కానీ రాజకీయాలు తగదు అన్నారు. ప్రజల విశ్వాసం కాపాడేలా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read: తెలంగాణ తల్లిని మార్చింది ఎవరు? ఊహించని ప్రశ్నతో కేటీఆర్ షాక్
అనంతరం ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అమ్మవారి ఆలయాన్ని ప్రభుత్వ ఖర్చుతో నిర్మించడంతో పాటు.. పంచలోక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొంతమంది రాజకీయ లబ్ధికోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. శ్రీ ముత్యాలమ్మ తల్లిని బీజేపీ ఎంపీ ఈటెల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆలయంపై దాడి చేసిన వారిని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.