Hyderabad Property Tax: ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు దృష్టి సారించాయి. ముఖ్యంగా మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు అధికారులు రకరకాల వ్యూహాన్ని అనుసరించేందుకు సిద్దమైనట్లు సమాచారం. వీటిలో తొలుత మొండి బకాయిలున్న సర్కారు ఆస్తులను గుర్తించి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్ల ట్యాక్స్ వసూళ్లను టార్గెట్ గా పెట్టుకోగా.. మూడు కార్పొరేషన్లలో ఇప్పటి వరకు రూ. 1,995 కోట్లు వసూల్ అయ్యాయి. వీటిలో రూ. 812 కోట్ల కలెక్షన్ తో సైబరాబాద్ మొదటి స్థానంలో ఉండగా రూ. 748.9 కోట్లతో జీహెచ్ఎంసీ రెండో స్థానంలో ఉంది. రూ. 433.1 కోట్లతో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ మూడో స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 19.5 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్ ) ఉండగా పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పీటీఐఎన్ ల సంఖ్య సుమారు 23 లక్షలకు పెరిగినట్లు తెలిసింది.
ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ కు తగిన విధంగా ట్యాక్స్ ను వసూలు చేసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా సర్కారు ఆస్తులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ చట్టంలోని 269 (2) ప్రకారం మొండి బకాయిలకు నోటీసులు జారీ చేసి అవసరమైతే అధికారులు నేరుగా బకాయిదారులను సంప్రదించి, వివరణ తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్ పరిధిలో మొత్తం రూ. 12 వేల కోట్ల వరకు మొండి బకాయిలు పేరుకుపోయినట్లు తెలిసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సుమారు 600 ఆస్తులకు చెందిన రూ.5 వేల కోట్లు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 ఆస్తులకు సంబంధించి మరో రూ. 500 కోట్లు ఉన్నాయి. అలాగే మరో రూ. 6 వేల కోట్ల వరకు ప్రైవేటు ఆస్తులకు చెందిన ట్యాక్స్ మొండి బకాయిలుగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మొండి బకాయిలు రూ. 12 వేల కోట్ల వరకు ఉండగా వీటిలో కనీసం ఏటా రొటీన్ కలెక్షన్ కాకుండా రూ. 1,000 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసుకోవాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు సమాచారం.
Also Read: Jio Recharge Plans: అద్భుతమైన జియో ప్లాన్.. 900 GB 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 365 రోజుల పాటు..
మొండి బకాయిల వసూళ్ల కోసం సర్కారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాస్త ముందుగానే వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్)ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పేరుకుపోయిన మొండి బకాయిలను ఈ స్కీమ్ ద్వారా చెల్లిస్తే వడ్డీలో 90 శాతాన్ని మినహాయించి కేవలం పది శాతమే ట్యాక్స్ చెల్లింపులను అధికారులు స్వీకరించనున్నారు. అయినా బకాయిదారులు చెల్లించేందుకు ముందుకు రాకపోవటంతో ట్యాక్స్ స్టాఫే వారి వద్దకు వెళ్లి వారికి మినహాయిస్తున్న 90 శాతం వడ్డీతో కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని వివరించాలని అధికారులు భావిస్తున్నారు. వారిని చైతన్యవంతులను చేయాలని ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు అధికారులు సూచిస్తున్నారు.