నేషనల్ హైవేలపై లిఫ్ట్ ఇస్తున్నారా..? పోనీలే సాయం చేద్దామని బండి ఆపుతున్నారా..? జనాలు లేని ప్రాంతాల్లో మీ వాహనం ఆపుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త… మీ ప్రాణాలకే ప్రమాదం.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తన కుటుంబానికి ఎదురైన ఒక భయానక అనుభవాన్ని వివరించింది. ఘాట్ రోడ్డులో కారు ఆపడం ఎంత ప్రమాదకరమో ఆమె కళ్లకు కట్టినట్లు వివరించారు.
అసలేం జరిగిందంటే..?
గత వారం రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తిరిగి వస్తోంది. అమ్రాబాద్ మండలం దోమలపెంట (బ్రహ్మగిరి) దాటిన తర్వాత నల్లమల అడవి మార్గంలో ప్రయాణిస్తుండగా.. సదరు మహిళకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. వాంతులు అవుతుండటంతో తట్టుకోలేక.. వారు అటవీ ప్రాంతంలో కారును పక్కకు ఆపారు. మహిళ కారు దిగి వాంతులు చేసుకుంటున్న సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది.
మాస్క్ ధరించిన అపరిచితుడు..
అడవి పొదల్లో నుండి ఒక అపరిచిత వ్యక్తి నెమ్మదిగా వారి కారు వైపు రావడం ఆమె గమనించారు. ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి.. తన రెండు చేతులను వెనుకకు దాచుకుని (ఆయుధం లేదా మరేదైనా వస్తువు ఉండొచ్చని అనుమానం) నేరుగా ఆమె వైపునకు రాసాగాడు. నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో ఆ వ్యక్తి ప్రవర్తన అత్యంత అనుమానాస్పదంగా ఉండటంతో ఆ మహిళ వెంటనే అప్రమత్తమయ్యారు.
తృటిలో తప్పిన ముప్పు..
ఆ వ్యక్తి కారు వద్దకు చేరుకునేలోపే సదరు మహిళ వేగంగా కారులోకి ఎక్కి తలుపులు వేసుకున్నారు. తన భర్తను అప్రమత్తం చేస్తూ.. కారు అద్దాలు మూసివేసి వెంటనే వాహనాన్ని ముందుకు పోనివ్వాలని కేకలు వేశారు. ఆ వ్యక్తి కారును సమీపించేలోపే వారు అక్కడి నుండి వేగంగా దూసుకుపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ‘ఒకవేళ నేను గమనించకపోయి ఉంటే.. ఏం జరిగి ఉండేదో తలచుకుంటేనే భయమేస్తోంది’ అని ఆమె ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్-శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తనకు ఎదురైన భయానక అనుభవాన్ని చెబుతూ వీడియో రిలీజ్ చేసిన ఓ మహిళ
ఇటీవల తన కుటుంబంతో కలిసి కారులో శ్రీశైలం వెళ్లిన మహిళ
మార్గ మధ్యలో ఓ వ్యక్తి అడవి వైపు నుంచి తమ కారు వద్దకు వచ్చే ప్రయత్నం చేసినట్లు… pic.twitter.com/XRre2fYYgt
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2025
ప్రయాణికులకు కీలక సూచనలు
-ఈ ఘటన నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు పోలీసులు, స్థానికులు పలు సూచనలు చేస్తున్నారు.
-నల్లమల అటవీ మార్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిర్మానుష్య ప్రదేశాల్లో ఆపకూడదు.
-అనారోగ్య సమస్యలు తలెత్తితే దోమలపెంట లేదా మన్ననూర్ వంటి జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే ఆగాలి.
-అడవిలో క్రూర మృగాల భయం మాత్రమే కాకుండా, ఇలాంటి అపరిచిత వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం పొంచి ఉందని గమనించాలి.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో.. అటవీ పోలీస్ యంత్రాంగం ఈ ప్రాంతంలో గస్తీ పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ALSO READ: Tirupati Crime: అత్తింటికి వెళ్లిన అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మామ.. ఇంతకీ ఏం జరిగిందంటే?