Hyderabad Vja Highway: సంక్రాంతి పండుగకు పట్నం వాసులు పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ కనిపిస్తుంది. శనివారం ఉదయం నుంచే పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కట్టాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.
గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లేవారు నార్కట్పల్లి వరకు వెళ్లి.. అక్కడ అద్దంకి హైవే ఎక్కాలని సూచిస్తు్న్నారు. విజయవాడ హైవే మీదుగా వెళ్తే హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్లో చిక్కుకుంటారు. అయితే కొంత దూరం పెరిగినా.. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుందని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలనుకునేవారు బెంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని, నాగార్జునసాగర్ హైవేపైకి ఎక్కితే జర్నీ సాఫీగా సాగిపోతుందని అంటున్నారు.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు.. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకుని, నార్కట్పల్లి దాటితే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేవాళ్లు ఓఆర్ఆర్ ఎక్కి ఘట్కేసర్లో ఎగ్జిట్ తీసుకుని, వరంగల్ హైవేపై ప్రయాణిస్తే ట్రాఫిక్ లో చిక్కుకోరు. ఇలా చేస్తే సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు. ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ తప్పించుకునేందు వరంగల్ రూట్ లో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read: సంక్రాంతి ఎఫెక్ట్! ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర వాసులు.. హైవేపై ఫుల్ ట్రాఫిక్!
ఇక ఏపీ వెళ్లే వాహనాలతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నిండిపోయింది. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్పాస్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతుండడంతో.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. కీసర టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.