HYDRA Action: స్వేచ్ఛ బ్యూరో: పార్కులను, రహదారులను కాపాడి లే ఔట్లకు ప్రాణం పోస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. లే ఔట్లలో పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతామన్నారు. లే ఔట్కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం హైడ్రా నిర్వహించే ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్లాట్ల హద్దులు చెరిపేసి అక్రమ అమ్మకాలు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాటిఘనాపూర్ విలేజ్ ఆనందనగర్ లేఔట్లో రహదారులు, పార్కులతో పాటు ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల ఆక్రమణలను పరిశీలించారు. 1980 వ సంవత్సరం 92 ఎకరాల్లో 1109 ప్లాట్లతో గ్రామపంచాయతీ లే ఔట్ ఉండగా, ఇందులో కొన్ని ప్లాట్లకు ఎల్ ఆర్ ఎస్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఆనందనగర్ కాలనీ పేరిట ఉన్న లేఔట్ హద్దులను చెరిపేసి ధరణి పాస్ బుక్స్ ద్వారా వ్యవసాయ భూమిగా చిత్రీకరించి, అమ్మకాలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. లే ఔట్లలోని ప్లాట్లున్న బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆక్రమణలు జరిగిన తీరును కమిషనర్ కు వివరించారు.
వారసుల పేరుతో ప్లాట్ల విక్రయం
పాటి ఘనాపూర్లాగే గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకరహిల్స్ పేరిట ఉన్న లే ఔట్ పరిస్థితి తయారైంది. అలాగే అమీన్పూర్ మండలం బీరంగూడ విలేజ్లోని సర్వే నెంబరు 996, 997లో ఉన్న ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లే ఔట్దీ ఇదే పరిస్థితి. 1983లో శంకరహిల్స్ పేరిట 493 ఎకరాలలో లే ఔట్ వేశారు. దాదాపు 3400ల ప్లాట్లతో వేసిన ఈ లే ఔట్ స్థలాన్ని కాలక్రమంలో వేరొకరికి వారసులుగా చెబుతున్న వారు అమ్మేశారు. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హౌజింగ్ బోర్డుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 9 ఎకరాల వరకూ కేటాయించింది.
పలు లేఔట్లలో అక్రమాలపై హైడ్రా ఫోకస్
ఇలా అనేక వివిదాల్లో చిక్కుకున్న శంకరహిల్స్ లే ఔట్ ప్లాట్ ఓనర్లతో హైడ్రా కమిషనర్ సమావేశమయ్యారు. అందరి వాదనలు విన్నారు. శంకరహిల్స్కు చెందిన లే ఔట్కు సంబంధించి అన్ని ఆధారాలతో రావాలని సూచించారు. శంకరహిల్స్ భూమి తమదంటూ క్లైమ్ చేస్తున్న అందరితో సమావేశం ఏర్పాటు చేసి లోతైన విచారణ తర్వాత చర్యలుంటాయని ఆయన స్పష్ట, చేశారు. బీరంగూడలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీకి చెందిన లే ఔట్ను కూడా పరిశీలించారు. తమ లే ఔట్ను ఆక్రమించుకుని కొంతమంది 100 గజాల చొప్పున అమ్మేస్తున్నారని సొసైటీ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
180 ఎకరాల లేఔట్లో అక్రమాలపై కమిషనర్ దృష్టి
1982లో వేసిన లే ఔట్లో పలు సంస్థల్లో పని చేసిన ఉద్యోగులు ప్లాట్లు కొనుగొలు చేయగా, ఇప్పుడవి అన్యాక్రాంతం అవుతున్నాయని పలువురు ఈ సందర్భంగా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 180 ఎకరాలలో దాదాపు 1650 ప్లాట్లతో లే ఔట్ వేసినట్టు రికార్డులు చూపించారు. లే ఔట్లలో పార్కులు, రహదారులను కాపాడాలని కోరారు. కొత్తగా ఆక్రమణలు రాకుండా చూడాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఎంతమేరకు ఉంది? అనేది పరిశీలించి ఫెన్సింగ్ వేయాలని సూచించారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకుని, కొనుగోలు చేసి ఉన్నవారు ఆందోళన చెందాల్సిన పని లేదని వారికి కమిషనర్ హామీ ఇచ్చారు.
శంభునికుంట ఔట్లెట్ కాలువను పునరుద్ధరిస్తాం
అనంతరం అమీనపూర్ మండలం బీరంగూడ విలేజ్ లోని శంభుని కుంట ఔట్లెట్లతో పాటు వరద కాలువను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఔట్ లెట్ నాలాను మూసేసి నిర్మాణం జరుపుతున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద కాలువలును పునరుద్ధరించి బాధ్యులపై కేసులు బుక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల టీఎన్జీవో కాలనీలో హైడ్రా పరిరక్షించిన 16 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అదే కాలనీలో టీఎస్ ఐఐసీకి కేటాయించినదిగా పేర్కొంటున్న ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో పరిశీలించి అక్కడ ఇంకా మిగిలి ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని హైడ్రా అధికారులను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.
Also Read: ఇది కదా అభిమానం అంటే.. దినేశ్ కార్తీక్ కోసం భారీ మానవహారం