Dinesh Karthik: స్వేచ్ఛ బ్యూరో: చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు తమ అభిమాన క్రికెటర్ దినేశ్ కార్తీక్ పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాల్లో భాగంగా సుమారు 3వేల మంది విద్యార్థులు భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును సృష్టించారు.
ఈ కార్యక్రమం ప్రధానంగా దినేశ్ కార్తీక్ జెర్సీ నంబర్ ‘19’ను ప్రతిబింబించేలా రూపొందించబడింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కలిసి ‘సీఏ♡డీకే19’ ఆకారంలో నిలబడి వీక్షకులను అబ్బురపరిచారు. ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ వినూత్న ప్రయత్నాన్ని గుర్తించిన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ , ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలు దీనిని రికార్డుగా నమోదు చేశాయి.
చెన్నైస్ అమృత గ్రూప్ చైర్మన్ ఆర్. భూమినాథన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు దినేశ్ కార్తీక్ స్వయంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కె. నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమినాథన్ మాట్లాడుతూ.. విద్యార్థులలో కృషి, పట్టుదల, బృంద స్ఫూర్తి , సమన్వయం వంటి విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
క్రీడోత్సవాల్లో భాగంగా క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ , అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడా పోటీలను కూడా విజయవంతంగా నిర్వహించారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడతాయని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది.
Also Read: రేవంత్ రెడ్డి ‘మార్క్’ స్ట్రాటజీ.. కేరళ ఎన్నికల్లో తెలంగాణ మంత్రుల సందడి!