హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక వారసత్వానికి హైడ్రా పునర్జీవం పోసింది. నిజాంల కాలం నాటి బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ఆక్రమణల చెర నుంచి విడిపించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. జనవరిలో ఈ చెరువు ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఒకప్పుడు 104 ఎకరాల విస్తీర్ణంతో కళకళలాడిన ఈ చెరువు, కాలక్రమేణా ఆక్రమణలకు గురై కేవలం 4 ఎకరాలకు కుంచించుకుపోయింది. గత ఏడాది ఆగస్టులో హైడ్రా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని.. అనేక అడ్డంకులను అధిగమించి ఆక్రమణలను తొలగించింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ నిర్దేశించిన మేర భూమిని స్వాధీనం చేసుకుని, దానిని ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తోంది. ‘కాలగర్భంలో కలిసిపోతుందనుకున్న చరిత్రకు ప్రాణం పోస్తున్నాం’ అని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్థానికులకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ చెరువు చుట్టూ అనేక వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
వాకింగ్ ట్రాక్ & ఓపెన్ జిమ్: చెరువు బండ్పై నడక సాగించేందుకు వీలుగా ట్రాక్లు, ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్లు నిర్మిస్తున్నారు.
ప్లే ఏరియా & గజబోలు: పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వృద్ధులు సేదతీరడానికి నాలుగు వైపులా గజబోలు (విశ్రాంతి గదులు) నిర్మిస్తున్నారు.
ఔషధ వనాలు: నిజాంల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా చెరువు చుట్టూ ఔషధ గుణాలున్న మొక్కలను, సుగంధ భరిత పుష్పాలను నాటాలని కమిషనర్ ఆదేశించారు.
భద్రత: పర్యాటకుల రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేస్తున్నారు.
రాజేంద్రనగర్, ఆరాంఘర్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు సులువుగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లను వెడల్పు చేస్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలోని వరద నీరు ఈ చెరువుకు వచ్చేలా ప్లాన్ చేయడం ద్వారా, పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. చెరువు కట్టను నిజాంల నాటి రాతి నిర్మాణ శైలిలోనే పటిష్టం చేస్తున్నారు.
1870లో మూడవ నిజాం సికందర్ జా ప్రధానమంత్రి నవాబ్ రుక్న్-ఉద్-దౌలా ఈ చెరువును నిర్మించారు. ఈ నీటికి ఔషధ గుణాలు ఉండేవని, నిజాం రాజులు ఇక్కడి నీటినే త్రాగడానికి ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, ఈ చెరువులోని సుగంధ పరిమళం వల్ల ఈ నీటిని గతంలో సెంటు (Perfume) తయారీ కోసం అరబ్ దేశాలకు కూడా పంపేవారట.
ఇంతటి ఘన చరిత్ర ఉన్న చెరువును తిరిగి పునరుద్ధరించడంపై పాతబస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ మాదిరిగా మారుతున్న నగరంలో ఈ చెరువు ఒక పచ్చని ఒయాసిస్లా మారుతుందని స్థానికులు కొనియాడుతున్నారు.
ALSO READ: Bandi Sanjay: కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం.. తెలంగాణలో ఇక బీజేపీదే హవా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు