కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతోందని బండి సంజయ్ అన్నారు. ఏపీని స్ఫూర్తిగా తీసుకొని మేం తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మోదీ సర్కార్ నిధులే అని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ నగరానికి ఒక ప్రత్యేకమైన మహిమ ఉందని.. ఇక్కడి ప్రశాంత వాతావరణంలో ఉంటే ఎవరికైనా బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజల ఆప్యాయతను మర్చిపోలేనని, అలాంటి నిస్వార్థమైన ప్రేమే వాజ్పేయిలో కూడా ఉండేదని గుర్తుచేసుకున్నారు. విశాఖ నగరం ఉద్యమాలకు పురిటిగడ్డ అని, గతంలో ఇక్కడి నుంచే బీజేపీకి మేయర్ స్థానాన్ని అందించిన చరిత్ర ఉందని కొనియాడారు.
రెండు ఎంపీ స్థానాలు ఉన్న పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత వాజ్పేయిదే అని సంజయ్ అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో పాకిస్థాన్కు వణుకు పుట్టించారని.. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడం ఆయన చొరవ వల్లే సాధ్యమైందని తెలిపారు. అటువంటి మహనీయుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అలాగే ప్రధాని మోదీ హయాంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని, కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని, దీనికి సహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో ప్రస్తుతం ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ పాలనను స్ఫూర్తిగా తీసుకుని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పాలనతో విసిగిపోయిన ప్రజలు, బీజేపీకి వేయాల్సిన ఓట్లను కాంగ్రెస్కు వేశారని.. అందుకే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విశ్లేషించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని.. ఆయన రాజకీయంగా క్రియాశీలకంగా లేరని బండి సంజయ్ అన్నారు. ప్రజలు కూడా ఆయన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ను తరిమికొట్టాల్సిన సమయం వచ్చిందని.. ఆ పార్టీ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీలో కాంగ్రెస్ను మూలాలతో సహా పెకిలించి సముద్రంలో కలిపేశారని.. త్వరలోనే తెలంగాణలో కూడా వాజ్పేయి విగ్రహావిష్కరణ వంటి భారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ALSO READ: Nara Lokesh : వారికి ఇక మూడినట్టే.. మంత్రి లోకేశ్ నోట మరోసారి ‘రెడ్బుక్’ మాట!