RV Karnan: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఇంటి నుంచి డైలీ చెత్త సేకరణ చేయాల్సిందేనని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో కలిసి ఇందిరా పార్క్ గాంధీ నగర్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు శానిటేషన్ పనులను ఆయన బుధవారం తనిఖీ చేశారు. సురభి పార్క్, పీ అండ్ టీ కాలనీ, గాంధీ నగర్ డివిజన్, కవాడిగూడ ప్రాంతాల్లో కమిషనర్ చెత్త సేకరణ, స్వీపింగ్ పనులను పరిశీలించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో స్వచ్ఛ ఆటో ల హాజరు, రెగ్యులర్ పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆయన తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆటో పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేసేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సదరు సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లదేనని ఆయన గుర్తు చేశారు. పబ్లిక్ ప్లేస్ లు, రోడ్లు, జంక్షన్లు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. నూటికి నూరు శాతం ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలని సూచించారు.
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి కాప్రా సర్కిల్ లో ఓల్డ్ కాప్రా, డాబా గార్డెన్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాలలో బుధవారం ఉదయం క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. సాకేత్ రోడ్ లోని సెకండరీ కలెక్షన్ పాయింట్ ను సందర్శించారు. వీలయినన్ని సెకండరీ కలెక్షన్ పాయింట్ లు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఓల్డ్ కాప్రాలో స్వచ్ఛ ఆటో డ్రైవర్ తో మాట్లాడుతూ కాలనీ లోని ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలని సూచించారు. అదే ప్రాంతంలోని కాలనీ వాసులతో మాట్లాడుతూ ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారు కూడా చెత్తను స్వచ్ఛ ఆటో కార్మికులకే ఇవ్వాలని కమిషనర్ సూచించారు.