మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రైతు సంక్షేమం – నాడు నేడు..
హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో రైతులు రాజులా బతికారని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సాఫీగా రుణమాఫీ జరిగిందని, రైతు బంధు పెట్టుబడి సాయం నేరుగా ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. అప్పట్లో యూరియా కోసం రైతులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కావాలంటే రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ రామాయంపేట..
రామాయంపేట ప్రజల దశాబ్దాల కల అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేవలం పరిపాలన విభాగమే కాకుండా.. మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 కోట్ల భారీ నిధులను కేటాయించిందని గుర్తు చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో తాము చేసిన కృషిని ప్రజలు గమనించాలని కోరారు.
సంక్షేమ పథకాలు – విమర్శలు..
మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి పేద కుటుంబాలకు అండగా నిలిచింది కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా బీడీ కార్మికుల కష్టాలను గుర్తించి వారికి పెన్షన్లు అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అయితే, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపిందని మండిపడ్డారు. ‘కేసీఆర్ హయాంలో రైతులకు అన్నం పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సున్నం పెట్టింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీని ఎగ్గొట్టి రైతులను వంచించిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.
ALSO READ: No Confidence Motion: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. పార్లమెంట్లో విపక్షాల పోరు!.