Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ పై వస్తున్న ఆరోపణల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పీసీీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. ‘చట్టం పరిధిలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక్కడ కక్ష సాధింపు ఎక్కడుంది? కక్ష సాధించే అవసరం మాకు లేదు. ఒకవేళ అదే మా ఉద్దేశం అయితే, మేము అధికారంలోకి రాగానే వెంటనే ప్రతిపక్ష నాయకులను లోపల వేసే వాళ్ళం కదా? తప్పు చేసిన వారికి చట్టం తప్పకుండా శిక్షిస్తుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
గవర్నర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ.. గవర్నర్పై ఒత్తిడి చేస్తే నిర్ణయం తీసుకుంటారనేది తప్పుడు ప్రచారం అని ఆయన కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరిని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వారి జాప్యాన్ని ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంతవరకు కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయించే అధికారం కేంద్రానికి ఉన్నా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి మధ్య ఉన్న ఒప్పందం ఏంటో తెలుసుకోవాలని సూచించారు. ‘ఇప్పటికీ నేను చెప్తున్నాను, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. మాపై విమర్శలు చేసే ముందు.. దీనికి సమాధానం చెప్పండి. వారు లోపాయికారీ ఒప్పందాలతో ఉండబట్టే గత ప్రభుత్వ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోలేకపోయింది. మేము ఏం చేస్తున్నామో ప్రజలందరికీ తెలుసు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చివరగా.. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు భయపడే ప్రతిపక్షాలు తమపై ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని.. ఇందులో ఎవరి జోక్యం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.