Illegal Constructions: మేడ్చల్ బ్యూరో, స్వేచ్ఛ: ఎల్లంపేట్ పురపాలక సంఘం రాజబొల్లారం వార్డు కార్యాలయానికి కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా కొనసాగుతున్నాయి. అధికారుల అండదండలతో కొంతమంది నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు నిర్మించడంతో పురపాలక సంఘానికి రావాల్సిన ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులే సూత్రధారులుగా మారడంతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుండగా, సంబంధిత శాఖ అధికారుల జేబులు నిండుతున్నాయనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి రాజబొల్లారం వార్డు పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పురపాలక సంఘం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో రాజబొల్లారం, ఘనపూర్ , రావల్ కోల్, డబిల్పూర్ వార్డు పరిధిలో సుమారు 100కి పైగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. నిర్మాణానికి ముందు కమిషనర్ అనుమతి తప్పనిసరి అయినప్పటికీ, నియమాలను పక్కనబెట్టి పనులు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఫీజులు, పన్నులు కోల్పోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయంపై కమిషనర్ స్వామి నాయక్ వివరణ కోరగా రాజబొల్లారం వార్డు పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి స్థానిక అధికారులకు పనులు నిలిపివేయాలని ఆదేశించామని తెలిపారు. అక్రమ నిర్మాణదారులకు నోటీసులు కూడా జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.