Ration Rice: పేద, మధ్యతరగతి ప్రజల కడుపు నింపేందుకు ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మర ఆడించి పంపిణి చేస్తున్న సన్న బియ్యంను కొందరు అక్రమ సంపాదన కోసం పక్కదారి పట్టిస్తున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద ప్రజలకు చేరవలసిన సన్నబియ్యం వనపర్తి, రాయచూర్ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యాన్ని అడ్డూ అదుపు లేకుండా కర్ణాటక ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన నిఘా సంస్థలు సైతం కనీసం పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులకు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
జిల్లాలో రేషన్ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ దుకాణం దక్కించుకున్న డీలర్, వివిధ కారణలతో తొలగించిన డీలర్ల స్థానంలో కేటాయించిన ఇన్చార్జీలు మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి. అలా కాకుండా బినామీలు నిర్వహిస్తూ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి తోడు డీలర్లకు మాత్రమే తెలియాల్సిన ఈ-పాస్ మిషన్ల కీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బినామీల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో వారే ఓపెన్ చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాలపై పర్యవేక్షణ లేకపోవడంతో బినామీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో బినామీ డీలర్లు కీ రోల్ పోసిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రేషన్ అక్రమ వ్యాపారంలో డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. రేషన్ షాప్ వద్దనే కస్టమర్ల నుంచి కేజీ 15 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన బియ్యాన్ని కేజీ 18 రూపాయల చొప్పున మద్యవర్తులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. మద్యవర్తుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్రమార్కుల ద్వారా రాత్రి సమయంలో వాహనాలతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్ల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యంను పిల్లిగుండ్ల, బిసి కాలనీ, బీడి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పలు ప్రాంతాలలో డంప్ చేసి అక్కడి నుంచి బొలేరో, డీసిఎం, ఇతర వాహనాలలో రాత్రి వేలలో అక్రమార్కుల ద్వారా వివిధ వాహనాలలో తరలిస్తున్నారు.
డీలర్ల నుంచి సేకరించిన రేషన్ బియ్యంను మోటార్ల సైకిళ్ల మీద తీసుకెళ్లి పట్టణంలో నిల్వచేస్తున్నారని, ధరూర్, కేటిదొడ్డి మండలాలకు చెందిన అక్రమార్కులకు డంప్ కేంద్రాల నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. రాత్రి వేళలో పోలీసుల గస్తీ ఉన్న అక్రమార్కులకు పోలీసులు వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకుని వదిలినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజీకి 25 రూపాయల చొప్పున కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో వాహనాలను తరలించేందుకు కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. పట్టణ డీలర్ ల పై నిఘా ఉంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ల్లాలోని గద్వాల పట్టణంతో పాటు మల్దకల్, అయిజ మండలంలో పలు పాయింట్లు కీలకంగా మారాయి. ఈ మూడు కేంద్రాలలో అక్రమార్కులు, మద్యవర్తుల, డీలర్ల నుంచి రాత్రి వేళల్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో బొలెరో వాహనాల్లో ఈ బియ్యం రవాణా కొనసాగుతోంది. గ్రామాల్లో సేకరించిన బియ్యాన్ని ఆయా గ్రామాలలో పాయింట్లు చేర్చి రాత్రి వేళల్లో లారీ వాహనాల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలోకి రేషన్ బియ్యం అక్రమ రమణా కొనసాగుతోంది. గత కొంతకాలంగా పోలీస్ సివిల్ సప్లయ్, టాస్క్ ఫోర్స్ అధికారుల నిఘా కరువైందని ప్రజలు బహాటంగా విమర్శిస్తున్నారు.
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి.. కర్ణాటక ప్రాంతానికి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెడతాం. పౌరసరఫరాలశాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారి పై, కొనుగోలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న జిల్లాలోని మండలాలపై ప్రత్యేక నిఘా పెట్టి బియ్యం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నివారిస్తాం.
Also Read: LPG Cylinder Delivery: వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా ఇంటికి చేరలేదా? సులభంగా ఇలా ఫిర్యాదు చేయండి