Musi Project: తెలంగాణ రాజకీయాల్లో మూసీ నది పునరుజ్జీవం అంశం ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల (PPT) యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్కు కౌంటర్గా.. నేడు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక వివరణ ఇవ్వనుంది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొని మూసీ ప్రాజెక్టుపై పార్టీ వైఖరిని, ప్రత్యామ్నాయ ప్రణాళికలను వివరించనున్నారు.
ఈ ప్రజెంటేషన్ ప్రధాన ఉద్దేశ్యం ‘ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని ఎలా సుందరీకరించవచ్చు’ అని నిరూపించడం. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనికి భిన్నంగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికలు, కేటాయించిన బడ్జెట్ ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ప్రజల ముందు ఉంచనున్నారు.
ప్రభుత్వం చెబుతున్న భారీ వ్యయం అవసరం లేదని, పేదల పొట్ట కొట్టకుండానే నదిని శుద్ధి చేయవచ్చని గణాంకాలతో సహా వివరించనున్నారు. మూసీ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు రాజకీయ కారణాలను, పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ ‘పీపీటీ వార్’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read: వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. కొండగట్టు సాక్షిగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!