Logo Misuse: స్వేచ్ఛ బ్యూరో: జలమండలి అధికారిక లోగోను కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జలమండలి అధికారులు వెల్లడించారు. జలమండలి పేరిట కొందరు ప్రైవేటు వ్యక్తులు వాటర్ ట్యాంకర్లను సప్లై చేస్తున్నట్లు, ఈ విధమైన చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమైనవిగా పరిగణించబడుతుందని, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని కూడా జలమండలి హెచ్చరించింది. జలమండలి లోగో అనేది సంస్థ ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నమని, దీనిని అనుమతి లేకుండా వినియోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని జలమండలి పేర్కొంది. ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను ఉపయోగించడం వల్ల, ఆ ట్యాంకర్లు ప్రభుత్వ సేవలుగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించింది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే గాక, మోసపూరిత చర్యగా గుర్తిస్తామని జలమండలి వివరించింది.
ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్గా పరిగణించి, లోగో దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. జలమండలి పేరు, లోగో, బ్రాండ్ను ఉపయోగిస్తూ కొంత మంది ప్రైవేట్ బోర్వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు అనధికారికంగా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నట్లు బోర్డు దృష్టికి వచ్చినట్లు కూడా పేర్కొంది. దీని వల్ల ఆ నీరు జలమండలి ద్వారా సరఫరా చేస్తుందన్న తప్పుడు భావన ప్రజల్లో కలుగుతోందని వెల్లడించింది. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు సాధారణంగా బోర్వెల్ల నుండి సేకరించి, ఈ నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయబడినది కాదని, అలాగే నాణ్యత పరీక్షలు కూడా చేయబడలవని, అందుకే ఈ నీటిని వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందని జలమండలి హెచ్చరించింది.
Also Read: Bhadrachalam vs Ayodhya: మోదీ గారు.. మా భద్రాచల రామయ్య దేవుడు కాదా? ఎందుకీ వివక్ష?
సాధారణ ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లపై ఆధారపడవద్దని జలమండలి సూచించింది. ఈ నీటి నాణ్యత సురక్షితం కాకపోవచ్చునని, ఆరోగ్యానికి హానికరమై ఉండే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకునే సందర్భంలో జలమండలి అధికారిక కస్టమర్ కేర్ సేవల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని, టోల్ ఫ్రీ నెంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేయబడిన తాగునీటిని పొందవచ్చనని జలమండలి తెలిపింది. ఇలాంటి ఘటనలు గుర్తించిన వెంటనే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో ఒక ప్రైవేట్ నీటి ట్యాంకర్ జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, ఆ ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవటంతో పాటు సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జలమండలి అధికారులు వివరించారు.
జలమండలి పరిధిలోని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, లోగో దుర్వినియోగం జరుగకుండా చూడాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లు లేదా ఇతర వ్యక్తులను గుర్తిస్తే సమీప జలమండలి కార్యాలయానికి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. ప్రజల సహకారం ద్వారా ఇలాంటి అక్రమాలను అరికడతామని జలమండలి అధికారులు పేర్కొన్నారు.
Also Read: Viral Video: గుడిలో చెప్పులు వేసుకొని.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చావగొట్టిన భక్తులు..!