తెలంగాణ అసెంబ్లీ వేదికగా మైనింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై ఆయన సంధించిన ప్రశ్నలు అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలోనే “నేను చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తే నాకు ఉరిశిక్ష వేయండి” అంటూ హరీశ్ రావు చేసిన సవాల్ సభలో కలకలం రేపింది.
⦿ ఆధారాలతో హరీష్ రావు..
శంషాబాద్ కోత్వాల్గూడ ప్రాంతంలో జీవో 111 నిబంధనలను తుంగలో తొక్కి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమంగా స్టోన్ క్రషర్ దందా నిర్వహిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేవు సరికదా కనీసం లైసెన్సులు లేకుండానే డీజిల్ జనరేటర్ల సహాయంతో భారీ ఎత్తున క్రషింగ్ సాగుతోందని ఆయన ఆధారాలను బయటపెట్టారు. మైనింగ్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం సదరు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. నిబంధనల ప్రకారం 25 వేల జరిమానా వేయడంతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష విధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
⦿ మంత్రుల కౌంటర్.. సభలో గందరగోళం
హరీశ్ రావు ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా స్పందించారు. కేవలం ఒక వ్యక్తిని లేదా ఒక కంపెనీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ శాఖలో ఏం జరిగిందో అందరికీ తెలుసని మంత్రి ఎద్దేవా చేశారు. ఒక కంపెనీపై వ్యక్తిగత దూషణలకు దిగడం హరీశ్ రావు స్థాయికి తగదని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయని ఒకవేళ నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో సభలో గందరగోళం నెలకొంది.
⦿ రాఘవ కన్స్ట్రక్షన్స్.. హరీష్ ఏమన్నారంటే..?
రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాల వల్ల మూసీ నది గండిపేట జలాశయాలు కలుషితం అవుతున్నాయని మైనింగ్ అధికారులే నివేదిక ఇచ్చారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడి విషయంలో ఒకలా అధికార పార్టీ మంత్రికి చెందిన సంస్థ విషయంలో మరోలా వ్యవహరించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదా హౌస్ కమిటీని వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు