Weather Update: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత భారీగా పెరిగింది, సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా నేడు చలి తీవ్రత మరింత దారుణంగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఉదయాన్నే పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ కానున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉత్తర తెలంగాణలో వణికిస్తున్న చలి..
ముఖ్యంగా ఈ చలి తీవ్రత ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పలు జిల్లాల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఇక్కడ కనిష్టంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
పొగమంచుతో ఇబ్బందులు
చలి తీవ్రతతో పాటు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. దీని కారణంగా రోడ్డు మార్గాలపై పొగమంచుతో కమ్ముకొని ఏమి కనిపించకపోవడంతో ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కావున, ఉదయం, రాత్రి వెళలో వాహానాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.. లేదంటే పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విలైనంత వరకు పగటి సమయంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పగటి వేళ సైతం ఈ పొగమంచు తగ్గకపోవడంతో, దీని వలన పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి.
ఆరెంజ్ అలర్ట్ జారీ
రానున్న నాలుగు రోజులు తీవ్ర చలిగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తూ, పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
జాగ్రత్తలు..
పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా, వృద్ధులు, పిల్లలు అనారోగ్యాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించడం, వేడి పానీయాలు తీసుకోవడం వంటివి చేయాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.
Also Read: రాష్ట్రంలో తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి అన్నదమ్ముల దుర్మరణం..
చలి నుంచి నివారణ చర్యలు
ప్రజలు చలి నుండి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులు, శాలువాలు, మంకీ క్యాప్లు, స్వేటర్లు వంటివి తప్పక ధరించాలి. ఇంట్లో హీటర్లు వాడుతున్నప్పుడు తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. చలికాలంలో త్వరగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధిక చలికి గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.