CM Revanth: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని (విజన్) దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించిన ఏర్పాట్లు, లక్ష్యాల గురించి కీలక వివరాలను వెల్లడించారు.
భవిష్యత్ విజన్ ఆవిష్కరణ:
ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ విజన్ను 2034, 2047 అనే రెండు విభాగాలుగా విభజించారు. ఈ సమ్మిట్ వేదికగా.. భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి, ఆలోచనలు , ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్ట్ బుక్’ను విడుదల చేయనున్నారు. అనేక రంగాలలోని ప్రపంచ దిగ్గజాలను, ప్రతినిధులను ఈ సమ్మిట్కు ఆహ్వానించినట్టు మంత్రి తెలిపారు. ఈ సమ్మిట్ను ప్రపంచంలోనే ‘రోల్ మోడల్ సమ్మిట్’గా నిర్వహించేందుకు అధికారులు 24 గంటలు పనిచేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం స్వయంగా సాయంత్రం వేదిక వద్దకు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
ఇండిగో సమస్యపై సీఎం సమీక్ష:
సమ్మిట్కు విదేశాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇటీవల తలెత్తిన ఇండిగో విమానాల సమస్య గ్లోబల్ సమ్మిట్ పై ప్రభావం చూపకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
Also Read: ఆత్మహత్యలపై రాజకీయమా ? కల్వకుంట్ల గద్దలకు సామ కౌంటర్ !
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో ఫ్లైట్స్ ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ విషయమై డిప్యూటీ సీఎం ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపారు.అంతే కాకుండా విదేశీ ప్రతినిధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సమ్మిట్కు చేరుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.