Jupally Krishna Rao : ఆదిలాబాద్ జిల్లా అనుకుంట కాలనీ బంగారి గూడ వార్డ్ 4 లో.. బాస గంగమ్మ- రమేష్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంత స్థలం, సురక్షిత నివాసం అందించే ముఖ్య లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ముమ్మరంగా అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున.. మొత్తం 4 లక్షల 50 వేల ఇళ్లు నిర్మించేందుకు 22,500 కోట్లు కేటాయించడమే.. ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.
అయితే ఇప్పటికే గృహం మంజూరు అయినప్పటికీ.. ఆర్థిక సమస్యల వల్ల ఇల్లు నిర్మించలేకపోతున్న లబ్ధిదారులు ఉన్న విషయాన్ని గుర్తించిన మంత్రివర్యులు, అలాంటి కుటుంబాల జాబితాను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. నివేదికల ఆధారంగా వారికి రుణాలు మంజూరు చేయించే చర్యలు తీసుకుని, ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చూస్తామని అన్నారు. ప్రతి పేదవాడికి గౌరవప్రదమైన సొంతింటిని ఇవ్వడం మా లక్ష్యం. దానిని అడ్డుకునే ఏ అడ్డంకినైనా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను మంత్రి జూపల్లి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలకు సంబంధించిన బాకీల పేరుతో దారితప్పించే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత పదేళ్లలోనే అప్పుల భారంతో రాష్ట్రాన్ని కుదేలు చేసిన వారే ఇప్పుడు బాకీ కార్డు అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు 3 ఎకరాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు మర్చిపోలేదు అని వ్యాఖ్యానించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా మంత్రి ప్రసంగంలో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. రైతులకు వరదలు, వర్షాల కారణంగా వచ్చిన నష్టపరిహారం విడుదల చేయించేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముందుకు రావాలని కోరారు. బిహార్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్లకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లే.. తెలంగాణకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
Also Read: అర్ధరాత్రి వేళ సీపీ సజ్జనార్ తనిఖీలు.. రౌడీ షీటర్ల ఇళ్లలో, షాపుల ఓనర్లకు వార్నింగ్
అనుకుంట కాలనీ ప్రజలు తమ ప్రాంత సమస్యలను మంత్రి జూపల్లికి వివరించగా, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల హక్కులకు, అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటికి వెలుగు నింపేందుకు కట్టుబడి ఉన్నదని మంత్రి పునరుద్ఘాటించారు.