EMD Refund:ఇందిరమ్మఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు తిరిగి చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ క్యూర్ పరిథిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో ఇండ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు సమయంలో ధరావతు (ఇఎండి) గా పదివేల రూపాయలను స్వీకరించారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఇఎండి మొత్తాన్ని కూడా పూర్తిగా ఆన్ లైన్ లోనే తీసుకున్నారు.
లాటరీలో ఎంపిక కాని దరఖాస్తు దారులకు
ఈ ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తి అయినందున, లాటరీలో ఎంపిక కాని దరఖాస్తు దారులకు ఇఎండి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ విపి గౌతం తెలిపారు. దరఖాస్తు దారులు తాము ఏ అక్కౌంట్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించారో అదే అక్కౌంట్ కు జమ చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎటువంటి దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో గా ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు.అయితే కొంత మంది దరఖాస్తు దారులు, తాము ఆయా మీ సేవా కేంద్రాల్లో నగదు ద్వారా చెల్లించామని, లేదా ఇతరుల అక్కౌంట్ నుంచి చెల్లించామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు.
ఇలా చెల్లించిన వారికి ఈ ధరావతు మొత్తం వారికే జమ అయ్యేలా చూడటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tghb.telangana.gov.in ద్వారా ఈ నెల 10 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. లేని పక్షం లో ఏ అకౌంట్ ద్వారా చెల్లింపు జరిగిందో, అదే అకౌంట్ కు తిరిగి జమ అవుతుందని తెలిపారు.
కొనసాగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియ…కార్యాలయాల చుట్టూ తిరగవద్దు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లో లాటరీ ద్వారా ఎంపికైన వారి వివరాల పరిశీలన కొనసాగుతున్నదనీ, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని వైస్ ఛైర్మన్ విపి గౌతం తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత అర్హులైన వారికి ఇండ్ల కేటాయింపు పత్రాలను (అలాట్మెంట్ లెటర్) అందచేస్తామన్నారు. ప్రతిపాదించిన 7340 ఇండ్లకు వెయిటింగ్ లిస్ట్ తో కలిపి సుమారు 10 వేల మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వారు సమర్పించిన వివరాల్లోని వాస్తవికతను క్షేత్రస్థాయిలో నిర్దారించుకోడానికే వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నారు.
వెరిఫికేషన్ ప్రక్రియ తరువాత ఈ పథకం కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏ విధంగా, ఏ ఖాతాలో చెల్లించాలన్న దానిని అలాట్మెంట్ లెటర్ లో పొందు పరుస్తా మన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియకు లాటరీలో ఎంపికైన వారు సహకరించాలని వైస్ ఛైర్మన్ కోరారు. ఈ ఇండ్లకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు కార్యాలయాలచుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, వాట్సాప్/ఎస్ఎంఎస్ వంటి వాటి ద్వారా అవసరమైన సమాచారం అందిస్తున్నామని, ఇతరత్రా ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ కు ఫోన్ (నెం. 040 24603572) చేయవచ్చని ఆయన సూచించారు.
నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తులకు 10 సెప్టెంబర్ )ఆఖరు తేదీ
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా తొలుత 16 నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ ద్వారా ఇండ్లకేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేయగా, మరో 4 నియోజకవర్గాల్లో ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. చాంద్రాయణగుట్ట, ఎల్.బి.నగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల పరిథిలో నిర్మించనున్న టవర్స్ లోని ఇండ్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తులను ఈ నెల 10 వ తేదీ వరకు సమర్పించవచ్చనీ, ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.