పార్టీ ఫిరాయింపుల అంశంలో శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజ్యంగ విరుద్ధంగా ఆయన నిర్ణయం ఉందన్నారు. అంతకుముందు.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన అంశంలో చివరగా మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వగా.. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయంలో తుది తీర్పును వెల్లడించారు. వీరిద్దరూ సైతం ఫిరాయింపులకు పాల్పడినట్టు సరైన ఆధారాలు లేవని భావించిన అసెంబ్లీ స్పీకర్.. వీరి అనర్హతపై దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. అనంతరం వారికి క్లీన్ చిట్ ఇస్తూ ప్రకటన చేశారు.అంతకుముందు వీరికి వ్యతిరేకంగా పిటిషనర్లు దాఖలు చేసిన అఫిడవిట్ల మీద స్పీకర్ ఇరు పక్షాల వాదనలు విన్నారు.
ఫిరాయింపుల అంశంలో దానం, కడియం శ్రీహరిపై తప్పకుండా వేటు పడుతుందని అంతా భావించారు. కానీ, స్పీకర్ నోటీసులకు కడియం, దానం నాగేందర్ వేర్వురుగా అఫిడవిట్స్ దాఖలు చేశారు.అనంతరం స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు.బీఆర్ఎస్ నుంచి తమను సస్పెండ్ చేయలేదని, ఎటువంటి విప్స్ జారీ కాలేదని స్పీకర్కు దానం వివరించినట్టు తెలిసింది.కడియం సైతం తాను ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఆయన వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వీరిద్దరూ అధికారికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు సరైన ఆధారాలు లేనందున అనర్హత పిటిషన్లను కొట్టివేసినట్టు తీర్పు చెప్పినట్టు తెలుస్తున్నది.
ఫిరాయింపులకు పాల్పడిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏం చేయబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిమీద హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? అని చర్చ జరుగుతున్నది. సుప్రీంకోర్టులో ఈ అంశం ఇప్పటికీ పెండింగులో ఉన్నది. స్పీకర్ నిర్ణయం త్వరగా తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం మూడు సార్లు స్పీకర్కు గడువు ఇచ్చింది. ఈ క్రమంలోనే శాసనసభాపతి తన నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా, ఆయన తీర్పును ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు.కావాలనే స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి తప్పుచేసిన వారికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యంపై దాడే అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా గెలిచిన వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజల తీర్పును అగౌరవ పరచడమే అని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ నిర్ణయం ఉందన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజు అని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పార్టీకి అనకూలంగా రాజ్యంగ వ్యవస్థలను ఉపయోగించడంలో ఇదొక చక్కటి ఉదాహరణ అని ఫైర్ అయ్యారు. ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులు దాన్ని తమ లాభం కోసం మార్చుకుంటే .. స్పీకర్ కూడా అందుకు సపోర్టు చేస్తే ఇంకా రాజ్యంగం, ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఎక్కడ ఉంటుందని నిలదీశారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలు స్పీకర్ నిర్ణయంపై ఆగ్రహమా? ఆవేదననా? అని చర్చ జరగుతున్నది.